ప్రజావాణిలో స్టూడెంట్ల తల్లిదండ్రుల నిరసన

ప్రజావాణిలో స్టూడెంట్ల తల్లిదండ్రుల నిరసన

కొడిమ్యాల, వెలుగు : టీచర్లు లేక తమ పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారని, కనీసం ఏబీసీడీలు వస్తలేవని, ఎక్కాలు చెప్పలేకపోతున్నారని, వెంటనే టీచర్లను నియమించాలని జగిత్యాల మండలం కొడిమ్యాల తహసీల్దార్​ఆఫీసులో జరిగిన ప్రజావాణిలో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్​లో 86 మంది  చదువుతుండగా, వీరికి కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు అవసరం కాగా   గతంలో ఒక్క టీచర్​మాత్రమే ఉండేవారు. సమస్యను ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్తే మరో టీచర్​ను అడ్జస్ట్​ చేశారు. 

అప్పటి నుంచి ఈ ఇద్దరితో పిల్లలందరికీ పాఠాలు చెప్పడం సాధ్య కావడం లేదు. దీంతో అందరినీ ఒకే చోట కూర్చుండబెట్టి గంపగుత్త చదువులు చెప్తున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో 30 మంది స్టూడెంట్ల తల్లిదండ్రులు సోమవారం తహసీల్దార్​ఆఫీసులోని ప్రజావాణికి తరలివచ్చారు. టీచర్లతో పాటు అటెండర్ గాని స్కావెంజర్ గాని లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చారు. తక్షణమే టీచర్లను రిక్రూట్ చేసి స్టూడెంట్ల చదువుకునేందుకు సాయం చేయాలని కోరారు.