
- సర్కారు స్కూళ్లలో స్టూడెంట్ల కష్టాలు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో మన ఊరు, మన బడి ప్రోగ్రాంలో ప్రభుత్వ స్కూళ్లలో రిపేర్ల కోసం ఉన్న వాటిని కూల్చి.. కొత్తవి కట్టకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో స్కూళ్లలో వసతుల కల్పనకు రూ. 400 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటాయించారు. కానీ వాటిలో పదో వంతు ఖర్చు చేయలేదు. పనులు ప్రారంభించినా చాలా చోట్ల మధ్యలోనే ఆగిపోయాయి.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 693 ప్రైమరీ స్కూల్స్,116 అప్పర్ ప్రైమరీ, 230 హైస్కూల్స్, 25 కేజీబీవీ, 10 ఆదర్శ కలిపి మొత్తం 1,252 బడులుండగా 1,31,057 విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో మన ఊరు, మన బడి ఫస్ట్ ఫేజ్కింద 407 పాఠశాలలకు మన రూ.400 కోట్లను కేటాయించారు. ఒక్కో స్కూల్కు కనీసం రూ.30 లక్షల నుంచి గరిష్టంగా రూ.60 లక్షల వరకు ఇస్తామని చెప్పారు. కొత్త టాయిలెట్స్, కరెంట్వసతి, తాగునీరు, సివిల్రిపేర్స్, ఫర్నిచర్, కిచెన్షెడ్, అదనపు క్లాస్ రూమ్స్నిర్మాణం, డైనింగ్హాల్, డిజిటల్క్లాస్రూమ్స్కలిపి మొత్తం 12 రకాల పనులు చేయొచ్చని తెలిపారు.
ఏదో అనుకుంటే ఇంకేదో అయింది..
2022 మార్చిలో హడావిడిగా 407 బడుల్లో రిపేర్ల కోసం కూల్చివేతలు చేపట్టారు. అయితే అందులో 40 స్కూళ్లలో మాత్రమే రూ. 28.39 కోట్ల పనులు జరిగాయి. రూ. 18.14 కోట్ల పేమెంట్స్ ఆగిపోయాయి. రూ. 10.25 కోట్ల బిల్స్ పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు బిల్స్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మొత్తం 316 బడుల్లో పనులు ఆగిపోగా.. అందులో 155 స్కూళ్లలో బాత్రూంలు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొత్త కలెక్టర్కు నివేదిస్తాం..
మన ఊరు మన బడిలో పెండింగ్ బిల్స్ కోసం పనులు చేసిన వ్యక్తులు ఇప్పటికీ తిరుగుతున్నారు. సారంగాపూర్జడ్పీ స్కూల్ ఇష్యూ హ్యూమన్ రైట్స్కమిషన్ దాకా వెళ్లిన నేపథ్యంలో జిల్లాలో టాయిలెట్స్లేక ఇబ్బంది నెలకొన్న బడుల వివరాలు కొత్త కలెక్టర్కు నివేదిస్తాం.
శ్రీధర్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్
హ్యుమన్ రైట్స్ కమిషన్ కు కంప్లైంట్
నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ జడ్పీ హైస్కూళ్లో మన ఊరు, మన బడి కింద స్కూల్ లో ఉన్న నాలుగు టాయిలెట్లలో మూడింటిని కూల్చేశారు. ఒక్కదాన్నే మిగిల్చారు. మొత్తం రూ. 38 లక్షల ఫండ్స్ కేటాయించగా.. రూ. 2.89 లక్షల పనులు మాత్రమే జరిగాయి. కూల్చేసిన మూడు టాయిలెట్లను నిర్మించలేదు. దీంతో స్టూడెంట్ల తల్లిదండ్రులు హ్యుమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 18 వ తేదీన కమిషన్ కలెక్టర్ కు జూన్ 27 వ తేదీలోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా అప్పటి కలెక్టర్ రాజీవ్ గాంధీ తన నిధుల నుంచి రూ. 11.68 లక్షలు కేటాయించారు. వెంటనే వాష్ రూమ్స్ నిర్మించాలని ఆదేశించారు.