
గత 15 నెలలుగా తక్కువ ధరకు వంట గ్యాస్ను అమ్మడమే కారణం
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) లకు సుమారు రూ. 35 కోట్లను సబ్సిడీగా ఇవ్వనుందని సీనియర్ అధికారి తెలిపారు. గత 15 నెలలుగా ఎల్పీజీ (వంట గ్యాస్) ని కాస్ట్ కంటే తక్కువ ధరకు విక్రయించడం వల్ల ఈ కంపెనీలకు భారీగా నష్టాలు వచ్చాయి.
ఈ నష్టాలను భర్తీ చేయడానికి సబ్సిడీని గవర్నమెంట్ ఇవ్వనుంది. ఈ కంపెనీలకు ఎంత నష్టం వచ్చింది, సబ్సిడీ ఎలా ఇవ్వాలి? వంటి విషయాలను ఫైనాన్స్ మినిస్ట్రీ త్వరలో ఖరారు చేస్తుందని సంబంధిత అధికారి వివరించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో (ఫిబ్రవరి 1, 2025) నష్టాల భర్తీకి నిధులు కేటాయించలేదు. కానీ ఏప్రిల్లో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ పెంచి రూ.32 వేల కోట్లను కేంద్రం సమీకరించింది.
ఈ ఆదాయాన్ని ఎల్పీజీ నష్టాల భర్తీకి ఉపయోగించే అవకాశం ఉంది. “ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ప్రభుత్వ కుటుంబంలో భాగం. నష్టాలను భర్తీ చేస్తాం. నష్టం ఎంతో, ఎలా భర్తీ చేయాలో చూస్తున్నాం” అని అధికారి అన్నారు. కాగా, ఎల్పీజీ ధరలను ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఇంటర్నేషనల్ బెంచ్మార్క్ సౌదీ సీపీ కంటే తక్కువ ధరకు అందిస్తోంది.
ఓఎంసీలకు 2024–-25లో రూ.40,500 కోట్ల ఎల్పీజీ నష్టాలు వచ్చాయని అంచనా. కానీ, రిటైల్ ఎల్పీజీ ధరను 14.2-కేజీ సిలిండర్కు రూ.50 పెంచడంతో నష్టాలు కొంత తగ్గాయి. గతంలో 2021–-22లో రూ.28,249 కోట్ల నష్టాలను, 2022--–23లో రూ.22 వేల కోట్ల నష్టాలను భర్తీ చేశారు.