పరువు నష్టం కేసులో రాహుల్, సిద్ధరామయ్య, డీకేకు సమన్లు

పరువు నష్టం కేసులో రాహుల్, సిద్ధరామయ్య, డీకేకు సమన్లు

కాంగ్రెస్‌ కీలక నేతలకు మరో షాక్‌ తలిగింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో బుధవారం (జూన్ 14న) కాంగ్రెస్‌ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్‌ సీనియర్ నేత రాహుల్‌ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. ఈ కేసు జూలై 27న విచారణకు రానుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. బీజేపీ ప్రభుత్వం 1.5 లక్షలు కొల్లగొట్టిందని, ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి 40 శాతం కమీషన్ తీసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై బీజేపీ పార్టీ పరువునష్టం దావా వేసింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కేశవ ప్రసాద్.. రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పై ఫిర్యాదు చేశారు. 

బీజేపీపై తప్పుడు ప్రకటనలతో దుష్ప్రచారం చేశారన్న ఆరోపణలపై బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇప్పటికే రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో ఎంపీ పదవిని కోల్పోయారు. రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ పై కోర్టుల్లో అప్పీల్ చేసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో కోలార్ లో రాహుల్ గాంధీ.. ‘‘మోడీ పేరున్న వారంతా దొంగలే’’ అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ క్రిమినల్ పరువు నష్టం కేసు వేశాడు. దీన్ని విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే పదవులకు అనర్హుడిగా మారుతారు. దీంతో రాహుల్ ఎంపీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది.