- నేడు రాజస్తాన్తో పోరు
- ఢిల్లీతో పంజాబ్ ఢీ
న్యూఢిల్లీ/ అహ్మదాబాద్: సీజన్ మధ్యలో కెప్టెన్ను మార్చుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్కు రెడీ అయింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్లో నెగ్గాల్సిన పరిస్థితి తెచ్చుకున్న హైదరాబాద్ ఆదివారం సాయంత్రం ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్లో జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్తో పోటీ పడనుంది. ఆరు మ్యాచ్ల్లో ఐదింటిలో ఓడిన ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉంది. వార్నర్ ప్లేస్లో కెప్టెన్సీ అందుకున్న కేన్ విలియమ్సన్ టీమ్ను గెలుపు దారిలోకి తీసుకొస్తాడని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. గత పోరులో చెన్నై చేతిలో తేలిపోయిన హైదరాబాద్ ఎలా పుంజుకుంటుందన్ని ఆసక్తికరం. టాపార్డర్పైనే ఎక్కువ ఆధారపడడం రైజర్స్ను దెబ్బతీస్తోంది. వార్నర్, బెయిర్స్టో, మనీష్ పాండే, విలియమ్సన్ రూపంలో వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ అందుబాటులో ఉన్నా.. ప్రతీ మ్యాచ్లో ఎవరో ఒకరు రాణిస్తున్నా.. మిడిలార్డర్ నుంచి సపోర్ట్ లేకపోవడంతోనే రైజర్స్ ఓడుతోంది. దీనికి వెంటనే పరిష్కారం కనుగొనకపోతే రైజర్స్ రాత మారడం కష్టం. రెండు ఫిఫ్టీలు చేసినా వేగంగా ఆడలేకపోతున్న వార్నర్ను ఫైనల్ ఎలెవన్ నుంచి కూడా తప్పించి ఆల్రౌండర్ జేసన్ హోల్డర్తో మిడిలార్డర్ బలం పెంచుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో కూడా నిలకడగా ఆడడం లేదు. ఈ సిచ్యువేషన్లో కొత్త కెప్టెన్ విలియమ్సన్, మనీశ్ పాండే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. గతానికి భిన్నంగా ఈసారి బౌలింగ్లోనూ రైజర్స్ నిరాశ పరుస్తోంది. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్పై ఎక్కువ ఆధారపడుతుండగా.. అతనూ పెద్దగా రాణించడం లేదు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ గాయంతో గత రెండు మ్యాచ్లకు దూరం అవగా.. ఖలీల్, సిద్ధార్ద్, సందీప్ కూడా ఆకట్టుకోవడం లేదు. బాల్తో మునుపటి పెర్ఫామెన్స్ చేస్తేనే రైజర్స్ పుంజుకోగలదు. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ కూడా ఈ సీజన్లో ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. ఆరు మ్యాచ్ల్లో నాలుగింటిలో ఓడింది. ఫారిన్ ప్లేయర్లు ఆర్చర్, స్టోక్స్ లేకపోవడం ఆ జట్టును దెబ్బ తీస్తోంది. ప్రతీ మ్యాచ్లో ఒకరిద్దరు రాణిస్తున్నా సమష్టిగా ఆడలేకపోతోంది. ఇక, అహ్మదాబాద్లో జరిగే సెకండ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో పంజాబ్ కింగ్స్ పోటీ పడనుంది. బ్యాటింగ్ బౌలింగ్లో రాణిస్తున్న ఢిల్లీ జోరుమీదుండగా.. గత మ్యాచ్లో పటిష్ట బెంగళూరుకు చెక్ పెట్టిన పంజాబ్ అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది.