- ఆరోపణలున్నోళ్లకే... మళ్లీ గుడ్ల కాంట్రాక్ట్
- టెండర్లలో కొత్తవాళ్లు పాల్గొనకుండా చక్రం తిప్పిన కాంట్రాక్టర్లు
- ఒక్క ప్రాజెక్ట్కు నోటిఫికేషన్ ఇచ్చి ఐదింటికి ఖరారు
- గతంలో ఫిర్యాదులున్నా పట్టించుకోని ఆఫీసర్లు
- రాజకీయ అండతో పాతోళ్లకే ఇచ్చారంటున్న ప్రజలు
సూర్యాపేట, వెలుగు : ఎవరిమీదనైనా ఆరోపణలు ఉంటే వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టడమో, మరోసారి పని అప్పగించకుండా చూడడమో చేస్తాం. చిన్నారులకు పౌష్టికాహారం అందించే విషయంలో అయితే ఇంకా అలర్ట్గా ఉండాలి. కానీ సూర్యాపేట జిల్లా ఆఫీసర్లు మాత్రం అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే మళ్లీ గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ను అప్పగించారు. పైగా వారి కోసం రూల్స్ను సైతం పక్కన పెట్టేశారు. ఆ కాంట్రాక్టర్లకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడం, వారి నుంచి ముడుపులు అందడం వల్లనే అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ అప్పగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆరోపణలొచ్చినా పట్టించుకుంటలే...
సూర్యాపేట జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాలకు రెండేళ్ల నుంచి తుంగతుర్తి, కోదాడకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లే గుడ్లను సరఫరా చేస్తున్నారు. వీరు ప్రభుత్వం సూచించిన దాని కన్నా చిన్న సైజు గుడ్లను సరఫరా చేస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పాటు గతంలో చివ్వెంల, సూర్యాపేట అర్బన్ పరిధిలో కుళ్లిన గుడ్లను సరఫరా చేశారని పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయినా వీరిపై ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడంతోనే ఆఫీసర్లు చర్యలు తీసుకోకుండా వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్లు వేసే టైంలోనే రూల్స్ ప్రకారం గుడ్లను సరఫరా చేసి, టెండర్ దక్కించుకున్నాక తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు అంగన్వాడీ సిబ్బంది వాపోతున్నారు. వీరిద్దరిపై అనేక ఆరోపణలు వచ్చినా బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా కింది స్థాయి ఉద్యోగుల నుంచి పైస్థాయి ఆఫీసర్ల వరకు మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నోటిఫికేషన్ ఒక్క ప్రాజెక్ట్కు... ఖరారు చేసింది ఐదింటికి
సూర్యాపేట జిల్లాలో చివ్వెంల, హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట అర్బన్ పరిధిలో మొత్తం ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 60 వేల మంది చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఉన్నారు. జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లకు గుడ్లు సరఫరా చేసేందుకు గత నెల 16 నుంచి 26 వరకు ఆన్లైన్లో టెండర్లు స్వీకరించారు. 26వ తేదీనే టెండర్లు ఖరారు చేయాల్సి ఉండగా, కొన్ని కారణాలతో ఈ నెల ఫస్ట్ వీక్లో టెండర్లను పూర్తి చేశారు. అయితే సూర్యాపేట ఐసీడీఎస్ పరిధికి మాత్రమే టెండర్లు తీసుకుంటామని నోటిఫికేషన్లో చెప్పిన ఆఫీసర్లు ఐదు ప్రాజెక్టులకు టెండర్లు ఖరారు చేయడం గమనార్హం. టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా చూసేందుకే ఇలా నోటిఫికేషన్ ఇచ్చారని తెలుస్తోంది. మరో వైపు ఒక కాంట్రాక్టర్ ఒక్క ప్రాజెక్ట్కే గుడ్లను సరఫరా చేయాలన్న రూల్ను పక్కన పెట్టి మరీ ఇద్దరికే ఐదు ప్రాజెక్ట్ల కాంట్రాక్ట్ను కట్టబెట్టారు.
కాంట్రాక్టర్లకు రాజకీయ అండ
అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ల వెనుక హుజూర్నగర్కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంతోనే వరుసగా వారికే కాంట్రాక్ట్ కట్టబెడుతున్నారని, నాసిరకంగా గుడ్లు సరఫరా చేసినా పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
ట్రేడర్లు లేకపోవడంతోనే..
అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసే టెండర్లలో పాల్గొనేందుకు ట్రేడర్లు ముందుకు రాకపోవడంతోనే గతంలో ఉన్న వారికే కాంట్రాక్ట్ దక్కింది. రూల్స్ ప్రకారం ఆన్లైన్ ద్వారా టెండర్లు నిర్వహించాం. మొత్తం ముగ్గురు టెండర్లలో పాల్గొంటే ఒకరిది ఫేక్ సర్టిఫికేట్ అని తేలింది. దీంతో మిగతా ఇద్దరికి టెండర్లు ఖరారు చేశాం.
-
జ్యోతి పద్మ,
వెల్ఫేర్ ఆఫీసర్, సూర్యాపేట