- చంద్రబాబు పిటిషన్లపై విచారణ వాయిదా
- ఏపీ సర్కారు కేసుల మీద కేసులు పెడుతున్నదన్న చంద్రబాబు తరఫు అడ్వకేట్
న్యూఢిల్లీ, వెలుగు : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్, ఫైబర్ నెట్లో ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను శుక్రవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
ముందుగా క్వాష్ పిటిషన్పై వాదనలు జరిగాయి. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. ‘‘ఏపీ సర్కారు కేసులపై కేసులు పెట్టి మమ్మల్ని సర్కస్ ఆడిస్తున్నది. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణకు ఫైబర్ నెట్ కేసుతో సంబంధం ఉంది. మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారెంట్ తీసుకున్నారు”అని చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.
సుదీర్ఘ వాదనల తర్వాత తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. తర్వాత ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చిందని లూథ్రా కోర్టుకు తెలిపారు. కొందరికి ముందస్తు బెయిల్, మరి కొంత మందికి రెగ్యులర్ బెయిల్ ఉన్నప్పుడు చంద్రబాబుకు బెయిల్ ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ ప్రస్తావన కూడా ఉండటంతో తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ద బోస్ తెలిపారు.