- ఏడాది శిక్షణ.. ఏడాది క్లర్క్షిప్ మస్ట్
న్యూఢిల్లీ: సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)గా న్యాయ సేవల్లోకి ప్రవేశించేందుకు ఇక మూడేళ్లకు బదులు ఏడాది యాక్టివ్ ప్రాక్టీస్ ఉంటే చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో శిక్షణ, మరో ఏడాది జడ్జిల పర్యవేక్షణలో క్లర్క్షిప్ చేయాల్సి ఉంటుంది. 2027 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసే పరీక్ష నోటిఫికేషన్లకు ఏడాది ప్రాక్టీస్ తప్పనిసరి. ప్రాక్టీస్ సర్టిఫికెట్ ద్వారా దాన్ని ధ్రువీకరించాలి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది శిక్షణ తర్వాత ఆరు నెలలు జిల్లా, సెషన్స్ జడ్జి లేదా హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ సభ్యుడి పర్యవేక్షణలో, మరో ఆరు నెలలు హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో క్లర్క్షిప్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ట్రాన్సిషన్ కాలానికి మినహాయింపు
మే 20, 2025 నుంచి 2027 మార్చి 31 వరకు జారీ చేసే నోటిఫికేషన్లకు ప్రాక్టీస్ నిబంధన వర్తించదు. ఈ కాలంలో న్యాయ విద్య పూర్తి చేసిన వారు ప్రాక్టీస్ లేకుండానే పరీక్ష రాయొచ్చు. ఎంపికైతే ఏడాది ట్రెయినీ జ్యుడీషియల్ ఆఫీసర్గా, తర్వాత ఏడాది క్లర్క్షిప్ చేయాలి. యువ న్యాయవాదులు, న్యాయ విద్యార్థులకు ఒక్కసారిగా మూడేళ్ల నిబంధన అమలు చేయడం ఇబ్బందికరమని కోర్టు పేర్కొంది. అందుకే పరిమిత సడలింపు ఇచ్చినట్లు తెలిపింది.
