గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా బ్యాంకు అకౌంట్లను వెల్లడించకపోవడం తప్పేనని బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది సుందరం కోర్టులో అంగీకరించారు. అయితే అవి డిపాజిట్లు కాదని, సేవింగ్స్ అకౌంట్స్ కావడం వల్లనే వెల్లడించలేదని చెప్పారు. అవి కూడా కృష్ణమోహన్ రెడ్డి భార్య పేరు మీద ఉన్నాయని తెలిపారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి చెందిన స్థలాన్ని గతంలోనే విక్రయించినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన సెల్ డెడ్, పత్రాలు కోర్టుకు అందజేశారు.
అనంతరం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం సెప్టెంబర్ 24న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులిచ్చింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది .
ALSO READ :రెగ్యులరైజ్ చేయాలని అంగన్వాడీ వర్కర్ల ధర్నా
2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టును ఆశ్రయించారు గద్వాల ప్రత్యర్థి డీకే అరుణ. సుధీర్ఘ వాదనల తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అనంతరం డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కృష్ణమోహన్ రెడ్డి. సెప్టెంబర్ 11న విచారించిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది.