- స్వలింగ జంటలకు పెండ్లి వద్దంటే.. హక్కులెట్ల కల్పిస్తరు?
- దీనిపై క్లారిటీ ఇవ్వండి.. వారి కోసం ఏదైనా పాలసీ రూపొందించండి
- కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: స్వలింగ జంటల పెండ్లిళ్లకు చట్టబద్ధత వద్దనుకుంటే.. ఆ జంటలకు సామాజిక హక్కులను ఎలా కల్పిస్తారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. వారు జాయింట్ బ్యాంక్ అకౌంట్లు తీయడం, బీమా పాలసీల్లో భాగస్వామిని నామినేట్ చేయడం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని సూచించింది. స్వలింగ జంటలు ఇలాంటి సామాజిక హక్కులను పొందేందుకు ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ఈ పిటిషన్లపై విచారణ చేస్తోంది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంలో పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు స్పందించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించకుండా వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ప్రశ్నించింది. ఇలాంటి అంశాలపై వివరణ కావాలని కోరింది. కేసులో తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.