కరోనా టెస్టులు చేసేందుకు అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్స్ ఉచితంగా పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. టెస్టులు చేయించుకోవడానికి వచ్చే వారి దగ్గర డబ్బులు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ల్యాబ్స్ లో మాదిరిగానే ఫ్రీగా కరోనా టెస్టులు చేయాలని సూచించింది. ప్రజలందరికీ ఉచితంగా కరోనా టెస్టులు అందుబాటులో ఉండాలని కోరుతూ శశాంక్ డియో సుధి అనే లాయర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం విచారించిన సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.
డబ్బు చెల్లింపుపై తర్వాత చూద్దాం..
నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ (NABL) లేదా భారత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ICMR) ఆమోదం పొందిన ల్యాబ్స్ లో మాత్రమే కరోనా టెస్టులు చేయాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ప్రైవేటు ల్యాబ్స్ కు తిరిగి టెస్టులకు డబ్బులు చెల్లించాలా లేదా అన్నదానిపై తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దేశం క్రైసిస్ లో ఉన్న ఈ సమయంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో
ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్ సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని సూచించింది సుప్రీం కోర్టు. ఇప్పటి వరకు ప్రైవేటు ల్యాబ్స్ లో రూ.4,500 చెల్లించి కరోనా టెస్టు చేయించుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం సుప్రీం ఆదేశాలతో ఫ్రీగా టెస్టులు చేయించుకునే వీలు కలుగుతోంది.
