
న్యూఢిల్లీ, వెలుగు: ఇంటి దగ్గరే విచారించాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 27న సుప్రీం కోర్టు బెంచ్ ముందుకు రానుంది. ఈ పిటిషన్ ను జస్టిస్ అజయ్ రస్టోగి, జస్టిస్ బిల ఎం త్రివేదిల బెంచ్ విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కవిత ఈ నెల 14న సుప్రీంను ఆశ్రయించారు. దాదాపు 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్(క్రిమినల్) లో ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్పీసీ ప్రకారం.. ఆడవాళ్లను పిలిచి విచారించవద్దన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కవిత కోరగా.. సీజేఐ జస్టిస్ చంద్రచుడ్ అందుకు నిరాకరించారు. మార్చి 24న విచారణ చేపడతామని వెల్లడించారు. అయితే, సుప్రీంకోర్టు కేసుల జాబితాలో కవిత పిటిషన్ ఈ నెల 27న బెంచ్ ముందుకు రానుంది. కవిత పిటిషన్పై ఆదేశాలు జారీ చేసే ముందు తమ వాదనను కూడా వినాలని ఈ నెల 18న ఈడీ సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.