- స్పీకర్ నిర్ణయం ఎప్పటిలోగా అని సుప్రీం కీలక ప్రశ్న
న్యూఢిల్లీ: టీఎంసీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెబల్ ఎంపీల అనర్హత పిటిషన్లపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ పిటిషన్ దాఖలు చేశారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాతో కూడిన బెంచ్ మంగళవారం పిటిషన్ను విచారించింది.
జారీచేసిన నోటీసులలో.. అభిషేక్ బెనర్జీ పిటిషన్పై తమ వైఖరి, సమాధానం తెలియజేయాలని 20 మంది రెబల్ ఎంపీలను ఆదేశించింది. టీఎంసీ నుంచి విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ)లో చేరడాన్ని ఎలా సమర్థించుకుంటున్నారో కూడా వారు స్పష్టం చేయాల్సి ఉంటుంది. అయితే, స్పీకర్, లోక్సభ కార్యదర్శి జనరల్కు మాత్రం ప్రస్తుతానికి నోటీసులు ఇవ్వలేదు.
కాగా, అభిషేక్ బెనర్జీ తరఫున సీనియర్ న్యాయవాది కల్యాణ్ బెనర్జీ వాదించారు. 20 మంది ఎంపీలపై అనర్హత పిటిషన్లు ఇచ్చినా స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు. జులై 27న రాతపూర్వకంగా కూడా గుర్తు చేశారని, ఆగస్టు 12న స్పీకర్ను కలిసి మరోసారి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారని చెప్పారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. స్పీకర్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ స్పీకర్కు నోటీసులు ఇవ్వడంపై తనకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు.
అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే 20 మంది ఎంపీలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. దీంతో స్పీకర్, కార్యదర్శి జనరల్కు నోటీసులు ఇవ్వకుండా 20 మంది ఎంపీలకు నోటీసులు ఇవ్వాలని బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్ జోయ్మాల్య బాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నోటీసులు జారీ చేయడం కాదు విచారణను నిర్ణీత గడువులోగా ముగించడమే ముఖ్యం’’ అని స్పష్టం చేశారు.
