న్యూఢిల్లీ:కరోనా కేసుల పెరుగుదల వల్ల కొన్ని కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతుండగా, మరికొన్ని కంపెనీలు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఇందుకు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) సరైన ఉదాహరణ. మనదేశంలో కరోనా కేసులు బయటపడ్డ తరువాత వ్యక్తిగత పరిశుభ్రతకు అవసరమయ్యే సబ్బులు, శానిటైజర్లు, బ్లీచింగ్ పౌడర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో హెచ్యూఎల్ ప్రొడక్షన్, స్టాక్స్ను విపరీతంగా పెంచి కస్టమర్ల డిమాండ్ తీరుస్తోంది. ఫలితంగా కంపెనీ స్టాక్ ఎన్ఎస్ఈ నిఫ్టీలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 14 శాతం పెరిగింది.
మిగతా కంపెనీల స్టాక్స్ విపరీతంగా నష్టాలను చవిచూస్తుండగా హెచ్యూఎల్ మాత్రం లాభాల్లోనే కొనసాగుతోంది. హాండ్ వాష్, డిటర్జెంట్లు, ఫ్లోర్క్లీనర్ల ప్రొడక్షన్ను విపరీతంగా పెంచామని, కొన్నింటి ధరలూ తగ్గించామని కంపెనీ సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. అందుకే హెచ్యూఎల్ షేర్కు 30 మంది ఎనలిస్టులు ‘బయ్’ రేటింగ్ ఇవ్వగా 12 మంది ‘హోల్డ్’ కాల్ ఇచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగింది కాబట్టి శానిటైజర్లు, సబ్బుల వాడకం ఇంకా పెరుగుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఎనలిస్ట్ సంజయ్ మన్యాల్ చెప్పారు.
హెచ్యూఎల్ చేతికి ‘ వీ వాష్’
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇప్పటికే దాదాపు ఐదు లక్షల మందికి సోకింది. వీరిలో 23,700 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే చాలా దేశాలు లాక్డౌన్ విధించడంతో ప్రజలు షాపుల ముందు లైన్లు కడుతున్నారు. సబ్బులు, డిజర్జెంట్లు మొదలు అన్ని వస్తువులను వీలైనంత ఎక్కువ కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘వీ వాష్’ అనే విమెన్ హైజీన్ బ్రాండ్ను గ్లెన్మార్క్ ఫార్మా లిమిటెడ్ నుంచి కొంటున్నట్టు హెచ్యూఏఎల్ ప్రకటించింది. డీల్ విలువ ఎంతో తెలియదు కానీ కొనుగోలు పనులు పూర్తి కావడానికి కొన్ని నెలలు పడుతాయని హెచ్యూఎల్ పేర్కొంది. కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ హెచ్యూఎల్ ఫ్యాక్టరీలకు ఎటువంటి ఇబ్బందులూ లేవని ముంబైకి చెందిన జేఎం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఎనలిస్ట్ రిచర్డ్ లియు అన్నారు.