ఏసీబీకి చిక్కిన సర్వేయర్.. భూమి కొలత వేసేందుకు రూ. 15 వేలు డిమాండ్‌‌

ఏసీబీకి చిక్కిన సర్వేయర్.. భూమి కొలత వేసేందుకు రూ. 15 వేలు డిమాండ్‌‌

నిర్మల్, వెలుగు: ఓ రైతుకు చెందిన భూమి కొలతలు వేసేందుకు లంచం డిమాండ్‌‌ చేసిన నిర్మల్‌‌ మండల సర్వేయర్‌‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌‌ గ్రామానికి చెందిన చిన్నయ్య అనే రైతు భూమి కొలతలు వేసేందుకు మండల సర్వేయర్‌‌ బాలకృష్ణను కలిశాడు.

రూ. 15 వేలు ఇస్తేనే కొలతలు వేస్తానంటూ బాలకృష్ణ చెప్పడంతో గతంలో రూ. 5 వేలు ఇచ్చాడు. మిగిలిన డబ్బులు ఇస్తేనే పని పూర్తవుతుందంటూ సర్వేయర్‌‌ బాలకృష్ణ స్పష్టం చేయడంతో బాధిత రైతు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు.

వారి సూచన మేరకు రైతు చిన్నయ్య మంగళవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌లో సర్వేయర్‌‌ను కలిసి రూ. 7500, అతడి ప్రైవేట్‌‌ అసిస్టెంట్‌‌ నాగరాజుకు రూ. 2,500 ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సర్వేయర్‌‌తో పాటు అతడి ప్రైవేట్‌‌ అసిస్టెంట్‌‌ను రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ కరీంనగర్‌‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.