
ఆసియా కప్ లో భాగంగా ఒమన్ తో జరిగిన చివరి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. శుక్రవారం (సెప్టెంబర్ 19) అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి మొదట సూర్య బ్యాటింగ్ చేస్తామని చెప్పడంతో ఈ మ్యాచ్ లో ఒమన్ కు ఘోర పరాజయం తప్పదనుకున్నారు. అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ ఒమన్ జట్టు అద్భుతంగా పోరాడింది. ఓడిపోయినా ఇండియా లాంటి జట్టుకు గట్టి పోటీ ఇచ్చామనే సంతృప్తితో టోర్నీ ముగించింది. మరోవైపు ఇండియా మాత్రం ఒమన్ పై ఊహించని ప్రయోగాలు చేసింది.
టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 8 వికెట్లు పడినా బ్యాటింగ్ కు రాకవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సూర్య బ్యాటింగ్ కు రాకపోవడంతో అతనికి ఏమైనా గాయమైందా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే జట్టులోని ఆటగాళ్లకు బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించాలనే ఉద్దేశ్యంతోనే సూర్య వెనక్కి తగ్గాడు. . ఏకంగా 11 వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడ్డాడు. సాధారణంగా సూర్య మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం సూర్య ఎన్ని వికెట్లు పడుతున్నా బ్యాటింగ్ కు దిగలేదు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడని భావించినా హర్షిత్ రానాను బ్యాటింగ్ కు పంపాడు. ఆఖరికి అర్షదీప్ సింగ్ కూడా సూర్య కంటే ముందుగా బ్యాటింగ్ కు వచ్చాడు.
సూర్య బ్యాటింగ్ కు దిగకపోవడానికి కారణం చెప్పుకొచ్చాడు. ఒమన్ తో మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.."ఈ టోర్నమెంట్ లో మా బ్యాటర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. సంజు, హార్దిక్ బ్యాటింగ్ చేయలేదు. అక్షర్, దుబే కూడా ఒక్క బాల్ ఆడలేదు. పాకిస్తాన్పై తిలక్ (వర్మ) కూడా బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ సమయం లభించలేదు. హర్షిత్ (రాణా) బ్యాటింగ్ లో కూడా రాణించగలడు. కాబట్టి చివరి 3 లేదా 4 ఓవర్లలో అతను ఎలా బ్యాటింగ్ చేయగలడో చూడాలనుకున్నాము.
చివరి రెండు ఓవర్లు మిగిలి ఉన్నప్పుడు అర్ష్దీప్ బ్యాటింగ్కు వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. నువ్వు బ్యాటింగ్ దిగడానికి నాకు లాంటి సమస్య లేదని అర్స్గాదీప్ కు చెప్పాను. నువ్వు బ్యాటింగ్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యన్తరం లేదని అన్నాను. నేను బ్యాటింగ్ చేసినా చేయకపోయినా జట్టుగా మనం మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. తర్వాత జరగబోయే మ్యాచ్ లో 11 స్థానంలో బ్యాటింగ్ కాకుండా ముందు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను (నవ్వుతూ)". అని సూర్య అన్నాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా.. ఆసియా కప్లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్–ఎ ఆఖరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 21 రన్స్ తేడాతో ఒమన్పై గెలిచింది. టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 188/8 స్కోరు చేసింది. సంజూ శాంసన్ (45 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీ చేయగా, అభిషేక్ శర్మ (15 బాల్స్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 38), తిలక్ వర్మ (29) రాణించారు.
189 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఒమన్ 20 ఓవర్లలో 167/4 స్కోరుకే పరిమితమైంది. ఆమిర్ కలీమ్ (46 బాల్స్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 64), హమ్మద్ మీర్జా (33 బాల్స్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో పోరాడినా ప్రయోజనం దక్కలేదు. శాంసన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టోర్నీలో ఆదివారం (సెప్టెంబర్ 21) పాకిస్థాన్ సూపర్-4 లో తొలి మ్యాచ్ ఆడనుంది.