వరుసగా రెండోసారి: టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కు సూర్య కుమార్ యాదవ్ నామినేట్

వరుసగా రెండోసారి: టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కు సూర్య కుమార్ యాదవ్ నామినేట్

ప్రస్తుతం ICC T20 ర్యాంక్‌లో నెంబర్ 1 ర్యాంక్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. వరుసగా రెండవ సంవత్సరం మెన్స్ T20I క్రికెటర్‌గా అవార్డును సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. 2022 లో టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సూర్య గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీలను ప్రకటించగా.. సూర్య కుమార్ యాదవ్ కు వరుసగా రెండోసారి ఈ లిస్టులో చోటు దక్కింది. జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్  సికందర్ రజా, న్యూజిలాండ్ చిచ్చర పిడుగు మార్క్ చాప్‌మన్, ఉగాండా స్పిన్ సంచలనం అల్పేష్ రంజానీలకు ఈ అవార్డు రేస్ లో ఉన్నారు.   

2021లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. అత్యంత నిలకడ చూపించడంతో పాటు వేగంగా పరుగులు చేస్తున్నాడు. ముంబైకి చెందిన సూర్య.. 2023 టీ 20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు. 18 మ్యాచ్‌లలో 48.56 యావరేజ్ తో 733 పరుగులు చేశాడు. వీటిలో 2 సెంచరీలు ఉండటంతో పాటు 155.95 స్ట్రైక్ రేట్‌ ఉండటం విశేషం. ఇప్పటివరకు మొత్తం T20I కెరీర్ లో 60 T20I ఆడిన సూర్య.. 4 సెంచరీలతో 2141 పరుగులు చేశాడు. 

జింబాబ్వే  స్టార్ ఆల్-రౌండర్ సికందర్ రజా  12 T20I మ్యాచులాడి 51.50 సగటుతో 515 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో 14.88 సగటుతో 17 వికెట్లు కూడా తీశాడు. న్యూజిలాండ్‌కు చెందిన చాప్‌మన్ ఈ పొట్టి ఫార్మాట్ లో పాకిస్తాన్‌పై ఒక సెంచరీతో సహా 21 మ్యాచ్‌లలో 576 పరుగులు చేశాడు. ఉగాండాకు చెందిన స్పిన్నర్ అల్పేష్ రంజానీ 2023లో 30 మ్యాచ్‌లలో 55 వికెట్లు పడగొట్టి గత ఏడాది అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మరి ఈ నలుగురిలో అవార్డు ఎవరికి వరిస్తుందో చూడాలి.