కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు రాజీనామా చేసిన కీలక నేత సువేందు అధికారి శనివారం బీజేపీలో చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆధ్వర్యంలో మిడ్నాపూర్లో జరిగిన ఓ బహిరంగ సభలో సుబేందు బీజేపీలో చేరారు. తనతోపాటు మరో 10 టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా టీఎంసీని వీడి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా సువేందు మాట్లాడుతూ.. ‘‘నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు అమిత్షాకు ధన్యవాదాలు. నాకు బీజేపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. టీఎంసీ నాయకత్వం నన్ను బాగా అవమానాలకు గురిచేసింది.’’ అని మండిపడ్డారు. శనివారం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన బెంగాల్ ఎమ్మెల్యేల్లో సువేందు అధికారి, తాపసి మండల్, అశోక్ దిండా, సుదీప్ ముఖర్జి, సైకత్ పంజా, షిభద్ర దత్త, దీపాలి బిశ్వాస్, సుక్రా ముండా, శ్యామప్ద ముఖర్జి, విశ్వజిత్ కుందు, బనశ్రీ మైతీ ఉన్నారు