వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ

వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ

లో క్​సభ ఎన్నికల పండుగ హడావుడి సమయాన ఓ వార్త  మనసులో  కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహలో అగ్రగణ్యుడైన  శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ శివైక్యం చెందడం వ్యక్తిగత నష్టం లాంటిది.  కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానానంద జీ  మహా మరణం, ఇప్పుడు స్వామి స్మరణానంద జీ  శాశ్వతంగా  నిష్క్రమించడం చాలామందిని విషాదంలోకి నెట్టింది. కోట్లాది మంది భక్తులు, సాధువులు, రామకృష్ణ మఠం, మిషన్ అనుచరుల మాదిరిగానే  నా హృదయం కూడా బాధగా ఉంది. ఈ నెల ప్రారంభంలో బెంగాల్ పర్యటనకు వెళ్లినప్పుడు స్వామి స్మరణానంద జీ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాను.

స్వామి ఆత్మస్థానానంద జీ మాదిరిగానే, స్వామి స్మరణానంద జీ ఆచార్య రామకృష్ణ పరమహంస, మాతా శారద,  స్వామి వివేకానంద ఆలోచనల ప్రపంచ వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ వ్యాసం రాస్తున్నప్పుడు ఆయనతో జరిపిన సమావేశాలు, ఆయనతో నా సంభాషణలు, ఆ జ్ఞాపకాలు నా మదిలో సజీవంగా ఉన్నాయి. 2020 జనవరిలో  బేలూరు మఠంలో ఉన్న సమయంలో స్వామి వివేకానంద జీ  గదిలో కూర్చొని  ధ్యానం చేశాను. ఆ పర్యటనలో నేను స్వామి స్మరణానంద జీతో స్వామి ఆత్మస్థానానంద జీ గురించి చాలాసేపు మాట్లాడాను. రామకృష్ణ మిషన్​తో బేలూరు మఠంతో  నాకు ఎంత  సన్నిహిత సంబంధం ఉందో మీకు  తెలుసు. ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా, గత ఐదు దశాబ్దాలుగా,  నేను వివిధ సాధువులను, మహాత్ములను కలిశాను. అనేక ప్రదేశాలకు వెళ్ళాను.

సామాజిక సాధికారతకుస్వామి స్మరణానంద పెద్దపీట

కొన్నేండ్లుగా స్వామి ఆత్మస్థానానంద జీ,  స్వామి స్మరణానంద జీ  వివిధ పదవుల్లో ఉంటూ సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారు. ఆధునిక విద్య,  నైపుణ్యం, మహిళా సాధికారత పట్ల ఇలాంటి మహానుభావులు ఎంత గంభీరంగా ఉండేవారో ఈ మహానుభావుల జీవితాలు తెలిసినవారికి తప్పకుండా గుర్తుండే ఉంటుంది. స్వామి ఆత్మస్థానానంద జీ మహోన్నత వ్యక్తిత్వంలోని ప్రత్యేకత నన్ను బాగా ఆకట్టుకుంది.  ప్రతి సంస్కృతి,  ప్రతి సంప్రదాయం పట్ల ఆయనకున్న గౌరవం,  ప్రేమ దీనికి కారణం. ఆయన భారతదేశంలోని  వివిధ  ప్రాంతాలలో చాలాకాలం గడిపారు.  అతను నిరంతరం ప్రయాణించేవారు.  గుజరాత్‌‌లో ఉంటూ గుజరాతీ మాట్లాడటం నేర్చుకున్నారు. నాతో కూడా ఆయన గుజరాతీలోనే మాట్లాడేవారు.

ఆయన గుజరాతీ కూడా నాకు బాగా నచ్చింది.  భారతదేశ అభివృద్ధి  ప్రయాణంలో అనేక దశలలో, మన మాతృభూమిని స్వామి ఆత్మస్థానానంద జీ,  స్వామి స్మరణానంద జీ వంటి ఎందరో సాధువులు ఆశీర్వదించారు, వారు సామాజిక మార్పు గురించి మనకు కొత్త చైతన్యాన్ని  అందించారు.  సమాజ శ్రేయస్సు కోసం కలసికట్టుగా పనిచేయాలని ఈ సాధువులు మనకు దీక్షను అందించారు. ఈ సూత్రాలు ఇప్పటివరకు శాశ్వతమైనవి. రాబోయే కాలంలో ఈ ఆలోచనలు అభివృద్ధి చెందిన భారతదేశానికి, అమృత్ కాలానికి సంకల్ప శక్తిగా మారతాయి. అలాంటి మహనీయులకు యావత్ దేశం తరఫున మరోసారి నివాళులర్పిస్తున్నాను. రామకృష్ణ మిషన్​తో సంబంధం ఉన్న వారంతా ఆయన చూపిన మార్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారనే నమ్మకముంది. ఓం శాంతి.

ఆధ్యాత్మికతకు జీవితాలు అంకితం

రామకృష్ణ మఠంలో కూడా  ఆధ్యాత్మికతకు తమ జీవితాలను అంకితం చేసిన సాధువులతో నాకు పరిచయం ఏర్పడింది.  వారిలో స్వామి ఆత్మస్థానానంద జీ,  స్వామి స్మరణానంద జీ వంటి ప్రముఖులు ఉన్నారు. ఆయన పవిత్రమైన ఆలోచనలు, జ్ఞానం నా మనస్సుకు నిరంతర సంతృప్తినిచ్చాయి. జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలంలో, అటువంటి సాధువులు నాకు ప్రజాసేవయే దేవుని సేవ అనే నిజమైన సూత్రాన్ని బోధించారు. 'ఆత్మనో మోక్షార్థ జగద్ధితాయ చ' అనే రామకృష్ణ మిషన్  సిద్ధాంతానికి  స్వామి ఆత్మస్థానానంద జీ,  స్వామి స్మరణానంద జీ జీవితాలు చెరగని ఉదాహరణ.  విద్యాభివృద్ధికి,  గ్రామీణాభివృద్ధికి  రామకృష్ణ మిషన్  చేస్తున్న కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం.

భారతదేశ ఆధ్యాత్మిక స్పృహ, విద్యా సాధికారత, మానవతా సేవ సంకల్పానికి  రామకృష్ణ మిషన్  కృషి చేస్తోంది. 1978లో బెంగాల్​ను వరదలు ముంచెత్తినప్పుడు రామకృష్ణ మిషన్ తన నిస్వార్థ సేవతో అందరి హృదయాలను గెలుచుకుంది. 2001లో కచ్  భూకంపం వచ్చినప్పుడు విపత్తు నిర్వహణకు రామకృష్ణ మిషన్ అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని నాకు ఫోన్ చేసి చెప్పిన వ్యక్తుల్లో స్వామి ఆత్మస్థానానంద ఒకరు. ఆయన సూచనల మేరకు రామకృష్ణ మిషన్ భూకంప విపత్కర సమయంలో ప్రజలకు ఎంతో సాయం చేసింది. 

నరేంద్ర మోదీ భారత ప్రధాన మంత్రి