స్కూళ్లకు రేటింగ్..5 స్టార్ రేటింగ్ వచ్చిన స్కూళ్లకు రూ.లక్ష ..సెప్టెంబర్ 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు

స్కూళ్లకు రేటింగ్..5 స్టార్ రేటింగ్ వచ్చిన స్కూళ్లకు రూ.లక్ష ..సెప్టెంబర్ 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు
  • జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక
  • స్వచ్​​ ఏవమ్​ హరిత విద్యాలయ సర్వేలో ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూల్స్​ పాల్గొనేందుకు అవకాశం

మెదక్/సంగారెడ్డి, వెలుగు: స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, పచ్చదనం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, విద్యుత్  పొదుపు, సోలార్​ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ‘స్వచ్ ఏవమ్  హరిత విద్యాలయ’ పేరుతో సర్వే చేపడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్  స్కూళ్లు ఈ సర్వేలో పాల్గొనవచ్చు. నిర్దేశిత అంశాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్  ఇస్తారు. మౌలిక వసతులు, వ్యర్థాల సమర్థ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్​ పొదుపు, సౌరశక్తిని వినియోగించుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
 
అన్ని స్కూళ్లకు అవకాశం..

స్వచ్  ఏవమ్​ హరిత విద్యాలయ సర్వేలో గవర్నమెంట్​ ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ, జడ్పీ హైస్కూళ్లు, కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్, ప్రైవేట్​ స్కూళ్లు పాల్గొనే అవకాశం ఉంది. సర్వేలో 60 ప్రశ్నలు, 125 మార్కులు ఉంటాయి. నీటి సంరక్షణ, తాగునీటి వసతికి 22 మార్కులు, మరుగుదొడ్ల నిర్వహణ, వ్యక్తిగత శుభ్రతకు 27, మొక్కలు, తోటల పెంపకానికి 14, వ్యర్థాల నిర్వహణకు 21, విద్యుత్​ పొదుపు, సోలార్​ వినియోగానికి 20, పర్యావరణ పరిరక్షణ, అవగాహనకు 21 మార్కులు ఉంటాయి. 35 నుంచి 50 మార్కులు వచ్చిన స్కూళ్లకు 2 స్టార్, 51 నుంచి 74 మార్కులు వచ్చిన స్కూళ్లకు 3 స్టార్, 75 నుంచి 89 మార్కులు వచ్చిన స్కూళ్లకు 4 స్టార్, 90 నుంచి 100 మార్కులు వచ్చిన స్కూళ్లకు​5 స్టార్​ రేటింగ్​ ఇస్తారు. జిల్లాస్థాయిలో ఎంపికైన స్కూళ్లకు 3 స్టార్ రేటింగ్, రాష్టస్థాయిలో ఎంపికైన  స్కూల్స్​కు 4 స్టార్  రేటింగ్, జాతీయ స్థాయిలో ఎంపికైన స్కూళ్లకు5 స్టార్  రేటింగ్  ఇస్తారు. 5 స్టార్  రేటింగ్  వచ్చిన స్కూల్ కు రూ.లక్ష బహుమతిగా లభిస్తుంది. ఆ నిధులను స్కూల్​ అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. 

శిక్షణ పూర్తి..

మెదక్  జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్​తో కలిపి 1,130 స్కూళ్లు ఉండగా, వాటిలో 1,23,626 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్​తో కలిపి 2,053 స్కూల్స్​ ఉన్నాయి. ఈ మేరకు స్వచ్  ఏవమ్  హరిత విద్యాలయ సర్వే నిర్వహణకు సంబంధించి టీచర్స్ కు శిక్షణ పూర్తయింది. ఈ సర్వేలో పాల్గొనేందుకు ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూళ్ల యాజమాన్యాలు ఈ నెల 30 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 

ఎంపిక ఇలా..

కలెక్టర్, డీఈవో, డీఎంహెచ్ వో, ముగ్గురు టీచర్లతో కూడిన డిస్ట్రిక్ట్​ లెవల్ ​సెలక్షన్​ కమిటీ స్కూళ్లను పరిశీలించి గైడ్ లైన్స్ కు అనుగుణంగా రూరల్​ ఏరియా నుంచి 6 స్కూళ్లు, అర్బన్  ఏరియా నుంచి 2 స్కూళ్లతో కలిపి 8 బడులను​ఎంపిక చేస్తుంది. రాష్ట్ర స్థాయి సెలక్షన్​ కమిటీ రాష్ట్రంలోని రూరల్​ ఏరియా నుంచి 16, అర్బన్​ ఏరియా నుంచి 4 స్కూళ్లతో​కలిపి 20 స్కూళ్లను ఎంపిక చేస్తుంది. జాతీయ స్థాయిలో రూరల్​ ఏరియా నుంచి 160, అర్బన్​ ఏరియా నుంచి 40 స్కూళ్లతో కలిపి 200 స్కూళ్లను ఎంపిక చేస్తారు. 

8 స్కూళ్లను ఎంపిక చేస్తాం..

జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి 8 స్కూళ్లను ఎంపిక చేస్తాం. దరఖాస్తులో వాస్తవ పరిస్థితులను మాత్రమే పొందుపర్చాలి. రేటింగ్​  కోసం ఈ నెల 30లోగా అప్లై చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్  స్కూళ్ల హెచ్ఎంలు, యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవడంపై దృష్టి పెట్టాలి.

- వెంకటేశ్వర్లు, డీఈవో, సంగారెడ్డి-