జీవితంలో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో గడిపిన అందమైన జ్ఞాపకాల్ని అప్పుడప్పుడు గుర్తుతెచ్చుకోవడం సహజం. అయితే, చావు దగ్గర పడినప్పుడు జీవితం ఒక్కసారిగా కళ్ల ముందు మెదులుతుందట. ‘ఫ్రాంటియెర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్’ జర్నల్లో వచ్చిన రీసెంట్ స్టడీ ఈ విషయం చెప్పింది. చనిపోతున్న వ్యక్తి మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నారు న్యూరోసైంటిస్ట్లు. అందుకోసం చనిపోతున్న వ్యక్తి మెదడు పనితీరుని స్టడీ చేశారు. ఇలా చేయడం ఇదే మొదటిసారి.
మూర్ఛ వ్యాధి ఉన్న 87 ఏండ్ల వ్యక్తి మెదడులోని తరంగాల్లోని మార్పుల్ని గమనిస్తున్నారు సైంటిస్ట్లు. అయితే, అదే టైమ్లో ఆయనకు హార్ట్ఎటాక్ వచ్చింది. దాంతో, చనిపోతున్న వ్యక్తి మెదడు చివరిసారిగా జ్ఞాపకాల్ని గుర్తుచేసే పనిలో ఉంటుందని గుర్తించారు సైంటిస్టులు. ‘‘పేషెంట్ చనిపోయే 30 సెకన్ల ముందు అతని మెదడుకి రక్త ప్రసరణ ఆగిపోయింది. కానీ, అతని మెదడు మెమరీస్ని గుర్తు చేసే పనిలో ఉండడం గమనించారు. ఆ పేషెంట్ గుండె ఆగిపోయిన 30 సెకన్ల తర్వాత కూడా మెమరీ కలెక్షన్ జరిగింది. బహుశా ఎవరికైనా జీవితంలోని ముఖ్యమైన జ్ఞాపకాల్ని ఆఖరిసారి గుర్తు చేసుకొనే ఛాన్స్ ఇదేనేమో. చనిపోయిన వాళ్లలోనే కాదు చావు అంచు వరకు వెళ్లిన వాళ్ల మెదడులో కూడా ఇలాగే జరుగుతుంది’’ అని చెప్తున్నాడు అమెరికాలోని లూయిస్ విల్లే యూని వర్సిటీకి చెందిన న్యూరో సర్జన్ అజ్మల్ జెమ్మర్.