- ఐర్లాండ్తో మ్యాచ్ వర్షంతో రద్దు
- టోర్నీలో మొదటిసారి తొలి రౌండ్ దాటిన జింబాబ్వే
పల్లెకెలె: టీ20 వరల్డ్ కప్లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా ఆట ముగిసింది. అద్భుత ఆటతో ఆ జట్టును ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వే ఇప్పుడు కంగారూల ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ సూపర్–8 రౌండ్ చేరుకుంది. మెగా టోర్నీ చరిత్రలో తొలిసారి ఫస్ట్ రౌండ్ దాటి రికార్డు సృష్టించింది.
మంగళవారం ప్రేమదాస స్టేడియంలో జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన గ్రూప్–బి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండా రద్దయింది. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. మూడు మ్యాచ్ల్లో రెండింటిలో గెలిచిన జింబాబ్వే మొత్తం ఐదు పాయింట్లతో గ్రూప్లో సెకండ్ ప్లేస్తో ముందంజ వేసింది.
శ్రీలంక (6 పాయింట్లు) ఇప్పటికే సూపర్–8 బెర్తు సొంతం చేసుకుంది. గ్రూప్లో మిగిలిన మూడు జట్లు (ఐర్లాండ్, ఆసీస్, ఒమన్) ఎలిమినేట్ అయ్యాయి. జింబాబ్వే, లంక చేతిలో ఓడిన ఆసీస్ ఖాతాలో రెండే పాయింట్లు ఉన్నాయి. ఇక, సూపర్–-8లో జింబాబ్వే గ్రూప్–2లో బరిలోకి దిగనుంది.
ఈ నెల 23న ముంబైలో వెస్టిండీస్తో, 26న చెన్నైలో ఇండియాతో, మార్చి 1న ఢిల్లీలో సౌతాఫ్రికాతో తలపడనుంది. గత ఎడిషన్కు కనీసం క్వాలిఫై కూడా కాలేకపోయిన జింబాబ్వే ఈసారి సూపర్–8 రౌండ్ చేరడం ఆరంభం మాత్రమేనని కెప్టెన్ సికందర్ రజా అన్నాడు. తదుపరి లక్ష్యంపై దృష్టి పెడతామని పేర్కొన్నాడు.
ఆసీస్ రెండో‘సారీ’
వన్డే వరల్డ్ కప్ విన్నర్ అయిన ఆసీస్ సూపర్–8 రౌండ్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. జింబాబ్వే టీమ్ ఐర్లాండ్తో పాటు శ్రీలంక చేతిలో ఓడిపోవాల్సింది. కానీ, ఐరిష్ టీమ్తో పోరు రద్దవడంతో ఆసీస్ ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టు అయింది.
2009లో రికీ పాంటింగ్ కెప్టెన్సీలో గ్రూప్ దశలో వైదొలిగిన కంగారూ టీమ్ 17 ఏండ్ల తర్వాత మెగా టోర్నీలో ఫస్ట్ రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. శుక్రవారం జరిగే తమ చివరి లీగ్ పోరులో ఆస్ట్రేలియా.. ఒమన్తో పోటీ పడనుంది.
* టీ20 వరల్డ్ కప్లో జింబాబ్వే రెండో దశకు చేరుకోవడం ఇదే తొలిసారి. 2003 తర్వాత ఓ వరల్డ్ కప్లో తొలి రౌండ్ దాటడం కూడా ఇదే ఫస్ట్ టైమ్.
