- ఇద్దరు యువకులు, ఫార్మసీ యజమాని అరెస్ట్.. డ్రగ్స్ సీజ్
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండలో యువత కొత్త తరహా డ్రగ్స్ వాడుతున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండానే ప్రమాదకరమైన మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారికి స్పాస్మో ప్రాక్సివాస్ ప్లస్, అల్ట్రాకింగ్ టాబ్లెట్లు, ట్రామాడెక్స్ ఇంజక్షన్లు అమ్మిన వారిని అరెస్టు చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ చందనాదీప్తి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ లోని రహ్మాన్బాగ్కు చెందిన మహ్మద్జబీఉల్లా, ఎన్జీ కాలేజీ సమీపంలోని శ్రీనగర్కాలనీ చెందిన మహ్మద్సల్మాన్ మత్తు మందులతో పట్టుబడ్డారని, వారు శివాజీనగర్లోని న్యూ హెల్త్కేర్ ఫార్మసీ యజమాని తౌడోజు నరేశ్ దగ్గర వాటిని కొన్నారని ఎస్పీ చెప్పారు.
వారిని అరెస్టు చేసి డ్రగ్స్ సీజ్ చేసినట్టు చెప్పారు. కొందరు యువకులు మత్తు టాబ్లెట్లను, ఇంజక్షన్లను సొంతంగా వినియోగించడమే కాకుండా ఇతరులకు కూడా అమ్ముతున్నారని తెలిపారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచామని, వాటిని వాడేవారిపైనా.. అమ్మే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్కు సంబంధించి సమాచారాన్ని సమీప పోలీస్స్టేషన్కు గానీ, డయల్100 కు గానీ తెలియజేయాలని కోరారు. వన్టౌన్ సీఐ సత్యనారాయణ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.