
హైదరాబాద్, వెలుగు: అంబర్పేట్లో నాలుగేండ్ల బాలుడిపై కుక్కలు దాడిచేసి చంపేసిన ఘటనపై బుధవారం కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి కంప్లయింట్ చేశారు. రాష్ట్ర సర్కారు, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి బాధ్యతారహిత కామెంట్లు చేశారని ఆరోపించారు. ‘షేమ్ కేటీఆర్.. షేమ్ మేయర్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కుక్కల బెడదకు పరిష్కారం చూపలేని మంత్రి అసమర్థతకు ఆ కామెంట్లే నిదర్శనమన్నారు. కుక్కలకు ఆకలి వేయడం వల్లే దాడులు చేస్తున్నాయని మేయర్ అనడం దారుణమని, ఇలాంటి నిర్లక్ష్యపూరిత కామెంట్లతో మానవ హక్కులను కాలరాశారని ఆరోపించారు.
వెంటనే కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరారు. కార్ల రేస్ మీద ఫోకస్ పెడుతున్న మంత్రి కేటీఆర్ కు తనశాఖలో ఏం జరుగుతుందో తెలుసుకొనే తీరిక కూడా లేదా? అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ నిలదీశారు. హెచ్ఆర్సీలో ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలుడి మృతిపై ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదని విమర్శించారు. మేయర్పదవికి విజయలక్ష్మి పనికిరారని మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. బాలుడి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారిం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నీలిమ, ఫిరోజ్ ఖాన్, కల్వ సుజాత, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జీహెచ్ఎంసీ ఆఫీసులోనూ కాంగ్రెస్ నేతలు కంప్లయింట్చేశారు. ఘటనకు బాధ్యత వహించి మేయర్ రాజీనామా చేయాలని జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ఫ్లోర్లీడర్ధర్పల్లి రాజశేఖర్ డిమాండ్ చేశారు.