అక్రమ ఓటర్ల లిస్ట్‌‌పై చర్యల్లేవ్‌‌ : మర్రి శశిధర్ రెడ్డి

అక్రమ ఓటర్ల  లిస్ట్‌‌పై చర్యల్లేవ్‌‌ : మర్రి శశిధర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఉన్న అక్రమ ఓటర్ లిస్ట్ దేశంలో మరెక్కడా లేదని, దీనిపై ఇంత వరకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో సైతం 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అప్పటి సీఈవో రజత్ కుమార్ చెప్పారని గుర్తుచేశారు. బుధవారం బీజేపీ స్టేట్‌‌ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈసారి ఒకే కుటుంబానికి చెందిన ఒకే ఇంట్లో ఉండే వారిని వేర్వేరు బూత్‌‌లలో ఓట్లు కేటాయించారని, ఇది ఎలక్షన్ కోడ్‌‌కు విరుద్ధమన్నారు. ప్రభుత్వం ఏది చెబితే అధికారులు అదే చేస్తున్నారని, ఓటు వేసేందుకు అవకాశం ఉన్నా ఇవ్వకపోవడం దారుణమన్నారు. 

శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ నిర్వాకం వల్ల ఓటర్లు ఇబ్బందులు పడ్డారని, అయనపై చర్యలు తీసుకోవాలని అధికారులు రిపోర్ట్‌‌ ఇచ్చినా.. ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికార పార్టీకి ఓటు వేయని వారి ఓట్లను తీసివేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. ఫాం–8 అప్లికేషన్లు ఇంకా పెండింగ్‌‌లో ఉన్నాయని, అభ్యంతరాలకు గడువు గురువారంతో ముగియనుందని, గడువు పెంచాలని కోరారు. వచ్చే నెల 4న ఫైనల్ లిస్ట్ వస్తుందని ఆయన తెలిపారు. పాత బస్తీలో కొత్త ఓట్ల అప్లికేషన్లపై అనుమానాలు ఉన్నాయని, వీటిని తనిఖీ చేయాలన్నారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తప్పుడు ఓటర్ లిస్ట్ రెడీ అవుతోందని, దీనిపై తాము కోర్టుకు వెళ్తామని ఆయన తెలిపారు.