తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమెరికాతో పోటీపడుతున్న నగరాన్ని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు.
పట్టణ ప్రగతి అంశంపై శాసన సభలో చర్చిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ఆదాయమంతా తమ హయాంలో పునాదులు వేసిన వాటి ఫలాలే అన్నారు. ఓఆర్ఆర్, మెట్రో, ఫ్లై ఓవర్లు తదితర ఎన్నో అభివృద్ధి పనుల్ని సిటీలో కాంగ్రెస్ చేపట్టడం వల్లే ఇంతలా అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
2 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్కనీసం హైదరాబాద్ పరిధిలో 1లక్ష ఇళ్లను కూడా చూపించలేకపోయారని ఆరోపించారు. తాము సంపదను సృష్టిస్తే బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ స్థలాలు అమ్ముతోందని ఆరోపించారు.
ఓఆర్ఆర్ లీజును 30 ఏళ్ల పాటు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించి వచ్చిన డబ్బు, పన్నుల రూపేణా వచ్చే డబ్బంతా ఇప్పుడే ఖర్చు చేస్తే రానున్న ప్రభుత్వాలకు ఆదాయ వనరులేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.
పేదోళ్లు బాగుపడితే కాంగ్రెసోళ్లకు ఇష్టం ఉండదు..
భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. పేదోళ్లు బాగుపడితే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇష్టం ఉండదని మంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో కాంగ్రెస్పార్టీకి చెప్పుకోదగ్గ లీడర్ కూడా లేరని అన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు చొరవతో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. కరెంటు, మంచినీటి విషయంలో పబ్లిక్ సమస్యలు పరిష్కరించామని అన్నారు.
గతంలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. దేశ విదేశాల ప్రతినిధులు సీఎం కేసీఆర్ పాలనను మెచ్చుకుంటుంటే ప్రతిపక్షాలు ఓర్వలేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. డబల్ బెడ్రూం ఇళ్లపై కాంగ్రెస్నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి అవాస్తవం అని కొట్టి పారేశారు. కొల్లూరు డబుల్ బెడ్రూం సముదాయంలో ఇళ్లు చూస్తే కాంగ్రెస్ నేతల కళ్లు బైర్లు కమ్ముతాయని ఎద్దేవా చేశారు.