రికార్డు స్థాయిలో పంటలు పండించారు: ప్రధాని మోడీ
సాగు నీటిని చక్కగా వాడుకున్నరు
‘పర్ డ్రాప్.. మోర్ క్రాప్’ మంత్రం ముఖ్యం
ఈ డికేడ్ ఇండియాదే..ప్రపంచం మనవైపు చూస్తోంది
చెన్నైలో పలు ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని
చెన్నై: రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారంటూ తమిళనాడు రైతులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ‘‘ఆహార ధాన్యాల ఉత్పత్తి, నీటి వినియోగం విషయంలో తమిళనాడు రైతులను అభినందించాలి. మనం చేయాల్సిందల్లా నీటిని సంరక్షించుకోవడమే. ‘పర్ డ్రాప్.. మోర్ క్రాప్’ మంత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి” అని సూచించారు. ఈ డికేడ్ ఇండియాదేనని, ప్రపంచం మొత్తం పాజిటివ్గా మనవైపు చూస్తోందని అన్నారు. ఆదివారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఆర్మీకి అర్జున్ ట్యాంకులను అందజేశారు. పుల్వామా అమరవీరులకు నివాళులర్పించారు.
మెట్రో ఫేజ్ 2 కు రూ.63 వేల కోట్లు
‘‘చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 కోసం రూ.63 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించాం. ఒక ప్రాజెక్టు కోసం ఒక సిటీకి ఒకే సారి ఇంతమొత్తంలో ఫండ్స్ ఇవ్వడం ఇదే తొలిసారి’’ అని ప్రధాని చెప్పారు. ‘‘చెన్నై మెట్రో వేగంగా పెరుగుతోంది. 9 కిలోమీటర్ల మేర కొత్త లైన్ను ప్రారంభించడం అందరికీ సంతోషాన్నిస్తుంది’’ అని వివరించారు. ఇక్కడి మత్స్యకారుల విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. శ్రీలంకలో ఉన్న తమిళులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు.
భద్రతా దళాలను చూసి దేశం గర్విస్తోంది..
భద్రతా దళాలను చూసి దేశం గర్వపడుతోందని ప్రధాని మోడీ అన్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన టెర్రరిస్టుల దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించారు.
పలు ప్రాజెక్టులకు పచ్చజెండా
చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 1 ఎక్స్టెన్షన్ను ప్రధాని ప్రారంభించారు. వాషర్మన్పేట్ నుంచి విమ్కోనగర్ దాకా నిర్మించిన మెట్రోలైన్కు పచ్చజెండా ఊపారు. దీంతో పాటు చెన్నై బీచ్, అట్టిపట్టు ఫోర్త్ లైన్ను, ఎలక్ట్రిఫికేషన్ చేసిన పలు లైన్లను ప్రధాని జాతికి అంకితమిచ్చారు.
ఆర్మీలోకి అర్జునుడొచ్చిండు
కొత్త అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ (ఎంకేఐఏ)ను ఆర్మీకి ప్రధాని అందజేశారు. ఈ సందర్భంగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్యాంక్ సెల్యూట్ స్వీకరించారు. అర్జున్ యుద్ధ ట్యాంకును డీఆర్డీవోలోని కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్, డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దేశీయంగా డిజైన్ చేసి, డెవలప్ చేసి, తయారు చేసింది.
హంటర్ కిల్లర్
దాదాపు 8,400 కోట్లతో 118 అప్డేటెడ్ అర్జున్ ట్యాంకులను తయారు చేశారు. అవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ(హెచ్వీఎఫ్)కి వీటిని తయారు చేసింది. 71 కొత్త ఫీచర్లను ఏర్పాటు చేశారు. పగలైనా, రాత్రయినా.. కచ్చితమైన లక్ష్యంతో ముందుకు సాగుతుంది. అన్ని రకాల భూభాగాల్లోనూ దూసుకెళ్తుంది. 68 టన్నుల బరువుండే ఈ ట్యాంకులను హంటర్ కిల్లర్స్ అని కూడా పిలుస్తారు.