మొత్తం పాకిస్తాన్‎నే కట్నంగా అడిగేశాడు: మాజీ ప్రధాని వాజ్‎పేయి కామెడీ టైమింగ్ వేరే లెవల్ భయ్యా..!

మొత్తం పాకిస్తాన్‎నే కట్నంగా అడిగేశాడు: మాజీ ప్రధాని వాజ్‎పేయి కామెడీ టైమింగ్ వేరే లెవల్ భయ్యా..!

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మంచి వాగ్ధాటిగల నాయకుడు. హిందీ, ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే ఆయన హాస్యంతో కూడిన ప్రసంగాలతోనూ అందరినీ ఆకట్టుకునేవారు. ఈ విషయం పార్లమెంట్‎లో ఎన్నోసార్లు నిరూపితమైంది. పార్లమెంటులో ప్రభావవంతమైన ప్రసంగాలు, సందర్భానుసారంగా హాస్యాన్ని పండిచడం ఆయన స్పెషల్. ప్రతిపక్ష నేతలు కూడా మంత్రముగ్ధులు అయ్యేవారంటే ఆయన ఎంతటి వాగ్దాటి గల నేతనో అర్ధం చేసుకోవచ్చు. 

ఈ క్రమంలోనే వాజ్‎పేయి చమత్కారం, పదునైన కామెడీ టైమింగ్ ఎలా ఉండేదో ఆయనతో అత్యంత దగ్గరగా ప్రయాణం చేసిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ వివరించారు. గురువారం (డిసెంబర్ 25) వాజ్‎పేయి 101 జయంతి వేడుకల్లో పాల్గొన్న రాజ్‎నాథ్ సింగ్.. వాజ్‎పేయి కామెడీ టైమింగ్‎కు సంబంధించి ఒక పాత సంఘటనను గుర్తు చేశారు.

 ‘‘1999లో వాజ్‎పేయి పాకిస్తాన్‎లో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆయన స్పీచ్‎కు మంత్రముగ్ధురాలైన ఒక అవివాహిత పాకిస్తానీ మహిళ తనను పెళ్లి చేసుకుని బదులుగా కాశ్మీర్ ఇస్తారా అని వాజ్‎పేయిని అడిగింది. వెంటనే స్పందించిన వాజ్‎పేయి.. నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. కానీ కట్నం కింద పాకిస్తాన్ మొత్తాన్ని కావాలని సదరు మహిళకు తనదైన వాక్చాతుర్యంతో బదులిచ్చారు. వాజ్‎పేయి కామెడీ టైమింగ్‎కు సమావేశంలో ఉన్నవారంతా నవ్వారు’’ అని పాత సంఘటనను గుర్తు చేసుకున్నారు రాజ్‎నాథ్ సింగ్. 

►ALSO READ | ఒడిషాలో భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ గణేష్ ఉయికే సహా ఆరుగురు మృతి

ఇదే కాకుండా మరో ఘటనను కూడా గుర్తు చేశారు. 2006లో ఇరాక్‌లో చమురు-ఆహార ఒప్పంద వివాదంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కుదేలైంది. దీనితో అప్పటి విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను కాపాడటానికి నట్వర్ సింగ్‌ను బలిపశువును చేశారా అని కొంతమంది జర్నలిస్టులు వాజ్‌పేయిని  ప్రశ్నించగా.. ‘నేను శాఖాహారిని’ అంటూ తనదైన శైలీలో ఆయన బదులిచ్చారని గుర్తు చేశారు.