తమిళనాడుకు చెందిన సుమారు 200 మంది రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పుర్రెలు, ఎముకలతో ఆందోళన చేపట్టారు. వ్యవసాయంలో ఆదాయం రెట్టింపు, నదుల అనుసంధానం చేస్తామని 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారని.. కానీ అవి నెరవేర్చలేదన్నారు రైతులు.
వ్యవసాయ ఆదాయాన్ని మూడింతలు పెంచుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా పంటల ధరలు పెరగడం లేదని రైతు అయ్యకన్ను వాపోయారు. ఒకవేళ కేంద్రం తమ డిమాండ్స్ తీర్చకుంటే వారణాసిలో మోదీపై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని హెచ్చరించారు. తాము ప్రధానికి వ్యతిరేకం కాదని, ఏ రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదన్నారు.
ముందుగా తమను నిరసనకు అనుమతి లభించలేదని.. కోర్టుకు వెళ్లి అనుమతి పొందామన్నారు రైతులు. తమిళనాడుకు చెందిన రైతులు గతంలో జంతర్ మంతర్ వద్ద ఇదే తరహాలో నిరసనలు చేపట్టారు.