లిక్కర్ షాపులు తెరిచేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం నుంచి మళ్లీ సేల్స్ మొదలు పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో రాష్ట్రంలో మే 17 వరకు లిక్కర్ షాపులు క్లోజ్ చేయాల్సిందేనని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పై సుప్రీం కోర్టు స్టే విధించడంతో మళ్లీ షాపులు తెరుస్తోంది. అయితే సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు టోకన్ సిస్టమ్ పాటించాలని నిర్ణయించింది. రోజుకు 500 మందికి మాత్రమే టోకన్లు జారీ చేసి.. వారికి మాత్రమే ఒక్కో షాపులో మద్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టస్మాక్) ఆధ్వర్యంలో మాత్రమే ఆ రాష్ట్రంలో మద్యం షాపులు నడుస్తాయి. వీటిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న చెన్నై, తిరువళ్లూర్, ఇతర కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మాత్రమే షాపులు తెరవాలని సూచించింది. మద్యం కొనుగోలుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి అని, షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.