
దేశవాళీ క్రికెట్లో సంచలనం నమోదైంది. విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు టీమ్ చరిత్ర సృష్టించింది. వన్డేల్లో 506 పరుగుల భారీ స్కోరు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. గ్రూప్Cలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు 50 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి..506 పరుగులు చేయడం గమనార్హం. ఈ స్కోరులో ఆ జట్టు తమిళనాడు ఓపెనర్ నారాయణ్ జగదీశన్ దే సగం పరుగులు కావడం విశేషం. అతను 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277 పరుగులు చేశాడు. అతనికి సాయి సుదర్శన్ 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సులతో 154 పరుగులు చేసి సహకరించాడు. ఈ ఇద్దరు ఫస్ట్ వికెట్కు ఏకంగా 416 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
ఇదే అత్యధిక స్కోరు..
506 పరుగులు చేసిన తమిళనాడు లిస్ట్ A క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టీమ్గా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోరు.. అత్యధిక భాగస్వామ్యం రికార్డును కూడా తమ పేరిట లిఖించుకుంది. లిస్ట్ ఏ క్రికెట్ తమిళనాడు తాజా ఇన్నింగ్స్ 506/2 మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్ 498/6, సర్రే జట్టు 496/6, ఇంగ్లండ్ 481/4 స్కోర్లు తర్వాతి స్థానంలో ఉన్నాయి.
రోహిత్ రికార్డు బ్రేక్..
ఈ మ్యాచ్ లో 277 వ్యక్తిగత స్కోరు చేసిన నారాయణ్ జగదీశన్..పలు రికార్డులను తనపేరు మీద లిఖించుకున్నాడు. ఏ స్థాయి వన్డే క్రికెట్లో అయినా జగదీశన్ చేసిన 277 పరుగులే అత్యధిక వ్యక్త స్కోరు. గతంలో ఈ రికార్డు ఎమ్ బ్రౌన్ (268) పేరిట ఉండేది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో రోహిత్ శర్మ 264 పరుగులతో మూడో ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో జగదీశన్ సెంచరీలతో చెలరేగుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచుల్లో ఐదు సెంచరీలు సాధించడం విశేషం. అంతేకాకుండా నారాయణ్ జగదీశన్ లిస్ట్ A క్రికెట్లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అటు విజయ్ హజారే ట్రోఫీ ఒకే సీజన్లో 4 సెంచరీలు చేసి కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.