హీరో విశాల్కు సీబీఐ నుండి పిలుపు.. కలలో కూడా అనుకోలేదట పాపం!

హీరో విశాల్కు సీబీఐ నుండి పిలుపు.. కలలో కూడా అనుకోలేదట పాపం!

తమిళ హీరో విశాల్(Vishal) ముంబై సెన్సార్ బోర్డుపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన మార్క్ ఆంటోనీ(Mark Antony) హిందీ సెన్సార్ కోసం లంచం అడిగారని షాకింగ్ కామెంట్స్ చేశారు విశాల్. ఆ సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి విశాల్ కామెంట్స్. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ముంబై సెన్సార్‌ బోర్డుపై కేసు నమోదు చేసింది.

హీరో విశాల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. సీబీఐ అధికారులు అక్టోబర్ మొదటి వారంలోనే కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా.. ముగ్గురు మధ్యవర్తులతో పాటు ముంబై సీబీఎఫ్‌సీకి చెందిన మరికొందరిపైనా విచారణ చేపట్టారు. అంతటితో ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్నారంతా కానీ.. ఇప్పుడు తాజాగా విశాల్ తనకు సీబీఐ నుండి పిలుపు వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.. నేను CBFC కేసు విచారణ కోసం ముంబైలోని CBI ఆఫీస్ కు వెళ్తున్నాను. ఈ  ఆఫీసుకి వెళ్తానని నా జీవితంలో అనుకోలేదు.. అంటూ రాసుకొచ్చారు విశాల్. మరి ఈ కేసులో విశాల్ ను ఎందుకు పిలిచారు? ఎలాంటి వివరాలు సేకరించనున్నారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక విశాల్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే మార్క్ ఆంటోనీ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విశాల్.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ హరితో ఓ కమర్షియల్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.