ఢాకా: భారత్ తో సంబంధాలపై బంగ్లాదేశ్ కాబోయే ప్రధాని తారిఖ్ రెహమాన్ తన వైఖరిని స్పష్టం చేశారు. భారత్ తో సమతుల్య సంబంధాలు కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత శనివారం ఢాకాలో మీడియాతో ఆయన మాట్లాడారు. తమ దేశ ప్రయోజనాలే ఇండియాతో విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. భారత్, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలను బంగ్లాదేశ్ కు యజమానిగా చూడబోమని స్పష్టం చేశారు.
ఏ దేశంతో అయినా తాము కోరుకునేది సమతుల్య సంబంధాలే అని, అదే సమయంలో ఏ ఒక్క దేశానికో తమ సంబంధాలను పరిమితం చేయబోమని పేర్కొన్నారు. రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి సంబంధాలు కొనసాగుతాయని తారిఖ్ చెప్పారు. మరోవైపు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ పీ) ని జమాతే ఇస్లామీ కన్నా ఉదారవాద, ప్రజాస్వామ్య పార్టీగా భారత్ చూస్తున్నది.
హసీనా నేతృత్వంలోని భారత్, బంగ్లాదేశ్ మధ్య స్వర్ణయుగం ముగిసిపోయినా.. బీఎన్ పీకి చేరువ కావాలని భారత్ యోచిస్తోంది. ఇదివరకే రెహమాన్ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య మెరుగైన సంబంధాల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ చెప్పారు.
