
గాంధీనగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపింది. ఈ మేరకు టాటా గ్రూప్, ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మృతులకు కుటుంబాలకు కోటి చొప్పున నష్టం పరిహారం.. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ భరిస్తామని తెలిపారు. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన అహ్మదాబాద్లోని బీజీ మెడికల్ కాలేజీ భవనాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
అంతకుముందు.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తనను కలచివేసినట్లు ఆయన పేర్కొన్నారు. తమ ఎయిర్ ఇండియా విమానం 171 అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ప్రభావితం అయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రస్తుత సమయంలో తమ ప్రధాన కర్తవ్యం విమానంలో ఉన్న ప్రయాణికుల కుటుంబాలకు అండగా నిలబడటమేనన్నారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ రెస్పాన్ బృందాలకు తమ సాయిశక్తులా సహాయం చేస్తున్నామని, తమ కస్టమర్ కేర్ టీమ్ కూడా సమాచారం అందిస్తోందన్నారు. మిగిలిన విషయాలు తమకు తెలిసిన వెంటనే పంచుకుంటామని వెల్లడించారు.
కాగా, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో మొత్తం అంటే 242 మంది చనిపోయారు. పైలెట్లు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా సజీవ దహనమయ్యారు.