ముంబై: టాటా మోటార్స్ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. మార్చి 2023తో ముగిసిన క్యూ4 లో రూ. 5407.79 కోట్ల లాభం సంపాదించింది. అంతకు ముందు ఏడాది నాలుగో క్వార్టర్లో కంపెనీకి రూ. 1,032.84 కోట్ల నష్టం వచ్చింది. తాజా క్యూ4 లో టాటా మోటార్స్ ఆపరేషన్స్ రెవెన్యూ కూడా 35.05 శాతం ఎగసి రూ. 1,05,932.35 కోట్లకు చేరింది. 2021–22 నాలుగో క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ రూ. 78,439.06 కోట్లు. లాభాల బాట పట్టిన నేపథ్యంలో డైరెక్టర్ల బోర్డు రూ. 2 చొప్పున డివిడెండ్ను రికమెండ్ చేసింది. ఆటోమోటివ్ వర్టికల్స్అన్నీ మంచి పెర్ఫార్మెన్స్ కనబరచినట్లు గ్రూప్ సీఎఫ్ఓ పీ బీ బాలాజీ చెప్పారు. భవిష్యత్లోనూ గ్రోత్ బాగుంటుందని, క్యాష్ ఫ్లో మరింత మెరుగవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సమీప భవిష్యత్లో కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో డిమాండ్ పుంజుకుంటుందనే అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023–24 లో టాటా మోటార్స్ పనితీరు ఇంకా బాగుండేలా టార్గెట్స్ పెట్టుకున్నామని బాలాజీ అన్నారు.
జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ రెవెన్యూ 7.1 బిలియన్ పౌండ్లు...
జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ క్యూ 4 రెవెన్యూ 49 శాతం పెరిగి 7.1 బిలియన్ పౌండ్లకు చేరినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. చిప్ సప్లయ్ మెరుగుపడటమే ఇందుకు కారణమని వివరించింది. నాలుగో క్వార్టర్లో అమ్మకాలు 24 శాతం అధికమై 94,649 యూనిట్లకు చేరినట్లు తెలిపింది. రిటెయిల్ సేల్స్ పెరగడమే కాకుండా, 2 లక్షల యూనిట్లతో ఆర్డర్బుక్ కూడా పటిష్టంగా ఉందని పేర్కొంది.
కమర్షియల్ వెహికల్స్...
తాజా క్వార్టర్లో (మార్చి 2023) కమర్షియల్ వెహికల్స్ బిజినెస్ రెవెన్యూ 14 శాతం పెరిగి రూ. 21,200 కోట్లకు, పాసింజర్ వెహికల్స్ బిజినెస్ రెవెన్యూ 15.3 శాతం ఎక్కువై రూ. 12,100 కోట్లకు చేరాయని టాటా మోటార్స్ తెలిపింది. ఏస్ ఈవీ డెలివరీలు మొదలయ్యాయని పేర్కొంది.
