హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి టీబీని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి పనిచేస్తున్నామని రాష్ట్ర టీబీ విభాగం జాయింట్ డైరెక్టర్ రాజేశం తెలిపారు. టీబీకి సంబంధించిన అన్ని టెస్టులు, ట్రీట్మెంట్ ఫ్రీగా అందించనున్నట్టు వెల్లడించారు. వ్యాధి నుంచి కోలుకున్న వారిని టీబీ చాంపియన్స్గా గుర్తించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
వ్యాధి సోకిన వారికి దాని నుంచి కోలుకునే వరకు కేంద్ర ప్రభుత్వ పథకం ‘నిక్షయ్ పోషణ యోజన’ కింద ప్రతినెలా రూ.500 చొప్పున అందిస్తున్నామని అన్నారు. మల్టీ డ్రగ్ థెరపీ తీసుకునే వారి రవాణా చార్జీలకు రూ.1,200 ఇస్తామని చెప్పారు. టీబీ నిర్మూలనలో ముందున్న నిజామాబాద్ జిల్లాకు.. ఈనెల 24న న్యూఢిల్లీలో జరిగే ప్రపంచ టీబీ దినోత్సవ కార్యక్రమంలో కేంద్రం సిల్వర్ మెడల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు కాంస్య పతకం అందించనుందని చెప్పారు.