టీసీఎస్ లాభం రూ.12,760 కోట్లు.. ఏడాది లెక్కన 5 శాతం పెరుగుదల

టీసీఎస్ లాభం రూ.12,760 కోట్లు.. ఏడాది లెక్కన 5 శాతం పెరుగుదల
  • మొత్తం ఆదాయం రూ. 63,437 కోట్లు
  • రూ. 11 చొప్పున ఇంటెరిమ్ ​డివిడెండ్‌‌‌‌


న్యూఢిల్లీ:   టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  (టీసీఎస్​) నికర లాభం ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో ఏడాది లెక్కన 5.98 శాతం పెరిగి రూ. 12,760 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్​గా నికర లాభం 4.38శాతం వృద్ధి చెందింది. గత జూన్​ క్వార్టర్​లో రూ. 12,040 కోట్లు, మార్చి క్వార్టర్​లో రూ. 12,224 కోట్లు నికర లాభాన్ని ప్రకటించింది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​ ఆదాయాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి.  

కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 63,437 కోట్లు ఉంది. ఇది గత సంవత్సరం ప్రకటించిన రూ. 62,613 కోట్ల కంటే 1.13 శాతం ఎక్కువ. క్వార్టర్​ ప్రాతిపదికన ఆదాయం 1.61శాతం తగ్గింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన కూడా ఇది 3శాతం తగ్గింది.  2025–-26 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 11 మధ్యంతర డివిడెండ్‌‌‌‌ను ప్రకటించింది.  

2024–-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 30 తుది డివిడెండ్‌‌‌‌ను ప్రకటించింది. టీసీఎస్​ మధ్యంతర డివిడెండ్ కోసం జులై 16, 2025ని రికార్డు తేదీగా నిర్ణయించింది. ఈ డివిడెండ్ అర్హులైన వాటాదారులకు ఆగస్టు 4, 2025న చెల్లిస్తారు. 

భారీ డీల్స్​...

ఈ క్వార్టర్​లో 9.4 బిలియన్​డాలర్ల విలువైన కొత్త డీల్స్​ను సంపాదించినట్టు టీసీఎస్ ​ప్రకటించింది. తాజా క్వార్టర్​లో 6,071 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు  ​ తెలిపింది. దీంతో ఉద్యోగుల మొత్తం సంఖ్య 6,13,069కి చేరుకుంది. రాజీనామాల (ఆట్రిషన్​) రేటు 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో 13.8 శాతానికి పెరిగింది. గత క్వార్టర్​లో 13.3 శాతం ఉంది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 24.5 శాతంగా,  నికర మార్జిన్ 20.1 శాతంగా ఉందని టీసీఎస్​ ప్రకటించింది. 

]ఇది గత క్వార్టర్​లో నివేదించిన 24.2 శాతం,  19 శాతం కంటే ఎక్కువ. ఫలితాల సందర్భంగా టీసీఎస్​ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,  మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ మాట్లాడుతూ, “ప్రస్తుతం ఉన్న ప్రపంచ స్థూల, ఆర్థిక  భౌగోళిక రాజకీయ సమస్యలు డిమాండ్ తగ్గుదలకు కారణమయ్యాయి. అన్ని కొత్త సేవలు బాగా వృద్ధి చెందాయి. ఈ క్వార్టర్​లో మేం బలమైన డీల్స్​ను సంపాదించాం. ఖర్చులను తగ్గించుకున్నాం. ఏఐ -ద్వారా మా క్లయింట్ల సమస్యలను పరిష్కరించడానికి వారితో కలిసి పనిచేస్తాం” అని అన్నారు.