- వాల్యుయేషన్ రూ.1.80 లక్షల కోట్లు
- వరుసగా ఐదో ఏడాదీ రికార్డు
- రెండో స్థానంలో ఇన్ఫోసిస్
న్యూఢిల్లీ: ఐటీ సేవలు అందించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారతదేశంలోనే అత్యంత విలువైన కంపెనీ ఐటీ బ్రాండ్గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా– 100 రిపోర్ట్ ప్రకారం.. టీసీఎస్ బ్రాండ్ విలువ 2026 నాటికి 21.2 బిలియన్ డాలర్లు (రూ.1.80 లక్షల కోట్లు) గా నమోదైంది. ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్గా ఈ కంపెనీ వరుసగా ఐదో ఏడాది కూడా ఈ ఘనత సాధించింది.
టీసీఎస్ భారీ కార్యాచరణ సామర్థ్యం, విస్తృతమైన గ్లోబల్ క్లయింట్ బేస్, వ్యూహాత్మక పెట్టుబడులు ఈ ఘనతకు కారణం. క్లయింట్లు ఏఐ సాంకేతికతను తమ వ్యాపార కార్యకలాపాల్లో నేరుగా అనుసంధానించేలా టీసీఎస్ సహాయం చేస్తోంది. తద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తోంది. ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 15 శాతం వృద్ధితో రూ.1.38 లక్షల కోట్లకు చేరింది. హెచ్సీఎల్ టెక్ బ్రాండ్ విలువ రూ. 76 వేల కోట్లకు ఎగిసింది.
విప్రో బ్రాండ్ విలువ మూడు శాతం పెరిగి రూ.51 వేల కోట్లకు చేరుకుంది. టెక్ మహీంద్రా బ్రాండ్ విలువ కూడా 3 శాతం వృద్ధితో రూ.30 వేల కోట్లకు చేరింది. క్లౌడ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ఇంజనీరింగ్ విభాగాల్లో పెరుగుతున్న డిమాండ్ ఈ సంస్థల ఎదుగుదలకు కారణమని ఈ రిపోర్ట్ వివరించింది.
