7న ఢిల్లీకి చంద్రబాబు... బీజేపీ పెద్దలతో భేటి

7న ఢిల్లీకి చంద్రబాబు... బీజేపీ పెద్దలతో భేటి

ఏపీలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ( ఫిబ్రవరి 7)  ఢిల్లీకి వెళ్తున్నారు. బుధవారం రాత్రి ఆయన బీజేపీ ముఖ్యులతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పొత్తుల అంశంపై ఓ క్లారిటీకి చంద్రబాబు రానున్నారు. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తులు ప్రకటించుకున్నాయి. సీట్ల సర్దుబాటు చర్చలు నిర్వహిస్తున్నాయి. అయితే బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఏ వైపు నుంచి అడుగు ముందుకు పడటం లేదు.

చంద్రబాబు వెంట జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేపు( ఫిబ్రవరి 7)  వెళ్లని పక్షంలో చంద్రబాబు పర్యటన తర్వాత పవన్ ఢిల్లీకి వెళ్తారు. రేపు( ఫిబ్రవరి 7) రాత్రికి చంద్రబాబు ఢిల్లీకి చేరుకుంటారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య పొత్తుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుని, కలిసి పని చేస్తున్నాయి. మరోవైపు, జనసేనతో తమ పార్టీ పొత్తులోనే ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.