ఎంఈవోపై ఉపాధ్యాయుడి దాడి..ఇల్లెందు మండలంలో సుభాష్నగర్ లో ఘటన

ఎంఈవోపై  ఉపాధ్యాయుడి దాడి..ఇల్లెందు మండలంలో సుభాష్నగర్ లో ఘటన
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుభాష్​నగర్ లో ఘటన

ఇల్లెందు, వెలుగు: ఎంఈవోపై టీచర్​ దాడి చేసిన ఘటన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుభాష్​నగర్​ జడ్పీ హైస్కూల్​లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  సుభాష్  నగర్  హైస్కూల్  హెచ్ఎం ఉమాశంకర్  ఎంఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

శుక్రవారం తాను పని చేసే స్కూల్​కు చెందిన టీచర్​ శంకర్  హాజరు రిజిస్టర్​లో మధ్యాహ్నం చేయాల్సిన సంతకం ఉదయాన్నే చేసినట్లు గుర్తించి, ఇలా ఎందుకు చేశావంటూ ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన టీచర్​ శంకర్  ఎంఈవో ఉమా శంకర్​ను అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రతో దాడి చేయడంతో చేతికి తీవ్రగాయాలయ్యాయి.

 కింద పడిపోయిన ఎంఈవోపై  దాడి చేసేందుకు యత్నించగా, తోటి ఉపాధ్యాయులు అడ్డుకొని ఎంఈవోను  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఎంఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంకర్​పై చర్యలు తీసుకోవాలని ఎంఈవో జిల్లా అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే శంకర్  స్కూల్​ నుంచి బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడడంతో పాటు ఓ మహిళా పీటీటీపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి.