- స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళన
- మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఘటన
జడ్చర్ల, వెలుగు : క్లాస్ వర్క్ చేయలేదన్న కోపంతో ఓ టీచర్ స్టూడెంట్ చెవిపై బలంగా కొట్టడంతో అతడి కర్ణభేరి దెబ్బతింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్కు చెందిన బి.సిద్దార్థ జడ్చర్ల పట్టణ శివారులోని స్వామి నారాయణ్ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతూ.. స్కూల్కు సంబంధించిన హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 7న క్లాస్ జరుగుతున్న టైంలో మ్యాథ్స్ టీచర్ నాగరాజు స్టూడెంట్ల హోమ్వర్క్ బుక్స్ను పరిశీలిస్తున్నాడు. సిద్దార్థ తన నోట్బుక్ను హాస్టల్ గదిలో మర్చిపోవడంతో అక్కడికి వెళ్లి బుక్స్ తీసుకొని వస్తున్నాడు.
దీనిని గమనించిన టీచర్ నాగరాజు సిద్దార్థను ఆపి చెవిపై బలంగా కొట్టడంతో రక్తస్రావం జరిగింది. దీంతో సిద్దార్థ తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు స్కూల్కు వచ్చి సిద్దార్థను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు చెవికి బలంగా తగలడంతో కర్ణభేరి దెబ్బతిందని, వినికిడి సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు సోమవారం స్కూల్కు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. వీరిని గమనించిన స్కూల్ యాజమాన్యం టీచర్ను ఓ గదిలో దాచి పెట్టడంతో ఆగ్రహానికి గురైన వారు టీచర్ను బయటకు తీసుకొచ్చి దాడి చేశారు.
సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. గేటు ముందు బైఠాయించి.. స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దార్థ తండ్రి రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ కమలాకర్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరపాలని హైదరాబాద్కు చెందిన అడ్వకేట్ రవీంద్రనాథ్ ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు.
