స్కూల్ పైకప్పు కూలిపడటంతో ఓ టీచర ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్ లోని బద్దోవాల్లో ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలోని స్టాఫ్ రూమ్లో నలుగురు ఉపాధ్యాయులు కూర్చున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన ముగ్గురు ఉపాధ్యాయులు -- నరీందర్జీత్ కౌర్, సుఖ్జీత్ కౌర్ , ఇందు రాణి -- చికిత్స పొందుతున్నారు. రవీందర్ కౌర్ మరణించినట్లుగా పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కలిసిన అనంతరం లూథియానా డిప్యూటీ కమిషనర్ (డీసీ) సురభి మాలిక్ మాట్లాడుతూ లూథియానా రూరల్ పోలీసులు కాంట్రాక్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రమాదంపై సీఎం మన్ తీవ్రంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఉపాధ్యాయుల చికిత్స ఖర్చులన్నీ పంజాబ్ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం తెలిపారని చెప్పుకోచ్చారు. స్కూల్ పైకప్పు కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.