
బంగ్లాదేశ్తో జరగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి 4 వికెట్ల దూరంలో నిలిచింది. 513 పరుగులతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన బంగ్లా..నాల్గో రోజు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ షకిబుల్ హసన్ 40 పరుగులతో..మెహ్ దీ హసన్ 9 పరుగులతో ఉన్నారు. చివరి రోజు బంగ్లా గెలవాలంటే 241 పరుగులు చేయాల్సి ఉంటుంది.
వికెట్ కోసం చమటోడ్చిన బౌలర్లు..
ఓవర్నైట్ స్కోరు 42/0తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. నాలుగో రోజు పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఇద్దరు ఓపెనర్లు ఏ దశలోనూ భారత బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. మొదటి సెషన్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఓపెనర్లు నజ్ముల్ షాంటో 156 బంతుల్లో 67 పరుగులు, జాకిర్ హసన్ 153 బంతుల్లో 66 పరుగులతో రాణించారు. వీరిద్దరు తొలి వికెట్కు 124 పరుగులు సాధించారు. స్పిన్ త్రయం అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 124 పరుగుల వద్ద శాంటో ఔటైనా... జకిర్ హసన్ సెంచరీతో చెలరేగాడు. 224 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్తో సరిగ్గా వంద పరుగులు చేశాడు.
రెండో సెషన్లో రాణించిన బౌలర్లు..
ఫస్ట్ సెషన్లో తేలిపోయిన భారత బౌలర్లు..రెండో సెషన్లో మాత్రం పర్వాలేదనిపించారు. 5 పరుగులు చేసిన యాసర్ అలీని అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా..లిట్టన్ దాస్ను కుల్దీప్ పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత సెంచరీ హీరోను అశ్విన్ బుట్టలో వేసుకున్నాడు. ఈ సమయంలో అక్షర్ పటేల్ మరోసారి మ్యాజిక్ చేశాడు. స్వల్ప వ్యవధిలో ముష్ఫికర్ రహీం, నురుల్ హసన్ను పెవీలియన్ చేర్చాడు. దీంతో బంగ్లా 238 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.