
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: బంగ్లాదేశ్ టూర్ నుంచి తిరిగొచ్చిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సొంతూరుకు వెళ్లి తల్లికి సర్ప్రైజ్ ఇవ్వాలని చేసిన ప్రయాణం అతని ప్రాణాల మీదకు తెచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కారు యాక్సిడెంట్లో పంత్కొద్దిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకొని గాయాలతో హాస్పిటల్లో చేరాడు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ మీదుగా హోమ్ టౌన్ రూర్కీ వెళ్తుండగా పంత్ నడుపుతున్న బీఎండబ్ల్యూ కారు హరిద్వార్ జిల్లా మంగ్లార్ వద్ద డివైడర్ను ఢీకొట్టి ఎగిరిపడింది.
పంత్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారుకు మంటలు వ్యాపించాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ బస్ డ్రైవర్, ఇతర ప్రయాణికులు పంత్ను కారు నుంచి బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా కాలిపోగా.. పంత్ను రూర్కీ సమీపంలోని సాక్షం హాస్పిటల్కు తరలించారు. తర్వాత మంచి ట్రీట్మెంట్ కోసం డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చేర్చారు.
ఇవీ గాయాలు..
పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని బీసీసీఐ ప్రకటించింది. ‘యాక్సిడెంట్లో రిషబ్ నుదుటిపై రెండు గాట్లు పడ్డాయి. కుడి మోకాలిలో స్నాయువులో చీలిక వచ్చింది. కుడి మణికట్టు, చీలమండ, బొటనవేలుకు గాయాలు అయ్యాయి. రిషబ్ పరిస్థితి నిలకడగా ఉంది. ఎంఆర్ఐ స్కాన్స్ చేసిన తర్వాత గాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకొని, అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తారు. ప్రస్తుతం రిషబ్కు ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లతో మా మెడికల్ టీమ్ మాట్లాడుతోంది. రిషబ్ కుటుంబంతోబోర్డు నిరంతరం టచ్లో ఉంది. రిషబ్కు బెస్ట్ ట్రీట్మెంట్ అందేలా చూసుకుంటుంది’ అని ప్రకటించింది. మరోవైపు పంత్ తొందరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెటర్లు ఆశించారు. పంత్ ఫ్యామిలీతో మోడీ ఫోన్లో మాట్లాడారు.
ఆ డ్రైవర్ చూడకపోయి ఉంటే..
ఈ యాక్సిడెంట్ను చూసిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ సాయం చేయడంతో పంత్ ప్రాణాలు దక్కాయి. ఆ సమయంలో ఎవ్వరూ చూడకపోతే ఘోరం జరిగిపోయేది. ఇది ఇతర స్పోర్ట్స్ పర్సన్లకు ఓ మేలుకొలుపు లాంటిది. లాంగ్ టూర్లు, ట్రెయినింగ్ తర్వాత సొంతంగా డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. శ్రీలంకతో సిరీస్కు దూరమైన పంత్ గాయాల నుంచి కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది.