హైదరాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని గూడెం (కడెం) లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ములుగు జిల్లాలోని మోడికుంటవాగు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తుది అనుమతులు వచ్చాయి. శుక్రవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఈ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్లో వీటితో పాటు పలు ప్రాజెక్టులను అప్రూవ్డ్ జాబితాలో చేర్చారు. ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల డీపీఆర్లను సీడబ్ల్యూసీతో పాటు జీఆర్ఎంబీకి సమర్పించింది. గూడెం లిఫ్ట్తో పాటు మోడికుంటవాగు ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తై ఆపరేషన్లో ఉన్నాయి. కడెం రిజర్వాయర్లో పూడిక పేరుకుపోవడంతో దాని ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు.
ఈక్రమంలో 3 టీఎంసీలు లిఫ్ట్ చేసేలా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. రూ.138.45 కోట్లతో ఈ లిఫ్ట్ స్కీమ్ నిర్మించారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని మోడికుంట వాగుపై మోడికుంటవాగు ప్రాజెక్టు నిర్మించారు. 5,500 ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు 2.04 టీఎంసీలను ఈ ప్రాజెక్టు నుంచి వినియోగిస్తున్నారు. రూ.124 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులకు గతంలోనే జీఆర్ఎంబీ ఆమోదం తెలుపగా ఇప్పుడు టీఏసీ తుది అనుమతులు ఇచ్చింది.
