కరకట్టలు ఎక్కడెక్కడ!.. నెలాఖరుకు సర్కారుకు రిపోర్టు

కరకట్టలు ఎక్కడెక్కడ!.. నెలాఖరుకు సర్కారుకు రిపోర్టు
  • భద్రాద్రి జిల్లాలో వరద నివారణపై స్టడీ చేయనున్న టెక్నికల్​ కమిటీ
  • కమిటీకి ఈఅండ్​సీ నాగేంద్రకుమార్​ నేతృత్వం
  • వారంలో భద్రాద్రికి రాక..
  • గోదావరి పరివాహక నివాస ప్రాంతాల సేఫ్టీకి మాస్టర్​ ప్లాన్​

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న నివాస ప్రాంతాల సేఫ్టీ కోసం కరకట్టల నిర్మాణానికి ఇరిగేషన్​ శాఖ మాస్టర్​ ప్లాన్​ రెడీ చేస్తున్నది. ఈమేరకు ఈఅండ్​సీ నాగేంద్రకుమార్​ నేతృత్వంలో  ఎ.శ్రీనివాసరెడ్డి(కొత్తగూడెం సీఈ), చంద్రశేఖర్​ (సీఈ, సీడీవో), విజయ్​ప్రకాశ్​( అడ్వయిజర్​),  డా. పి.రామనాథ్​(కన్సల్టెంట్​), కె.శ్రీనివాసరెడ్డి( ఎస్​ఈ, పీఅండ్​ఎం)లతో కూడిన టెక్నికల్​ కమిటీ నియమించారు. ఈ కమిటీ వారం రోజుల్లో భద్రాచలం రానున్నది. ఇక్కడ  కరకట్టల నిర్మాణం సాధ్యసాధ్యాలపై స్టడీ చేసి ఈ నెలాఖరు కల్లా సర్కారుకు రిపోర్టు అందజేయనుంది.  ఫీల్డ్​ లెవల్​ నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించి ఇవ్వడానికి భద్రాచలం ఇరిగేషన్​ డివిజన్​ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.

నాలుగు మండలాల్లో 85 కిలోమీటర్ల మేర..

భద్రాచలం, దుమ్ముగూడెం,  బూర్గంపాడు,  అశ్వాపురం మండలాల్లో గోదావరికి, వాగులకు ఇరువైపులా 85 కి.మీ.ల  మేర కరకట్టల నిర్మాణం చేపట్టనున్నారు.  సీతమ్మసాగర్​ బ్యారేజీకి ఎగువన అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం,చర్ల మండలాల్లో ఇప్పటికే 49 కి.మీల కరకట్టల నిర్మాణాలు జరుగుతున్నాయి.  బ్యారేజీకి దిగువనున్న ప్రాంతంలో కూడా వరద నివారణ చర్యల కోసం ప్రత్యేకంగా రూ.3,500కోట్లతో కరకట్టల డిజైన్  చేసిన ఇరిగేషన్​ ఇంజినీర్లు ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ డిజైన్లపై సుదీర్ఘంగా చర్చలు జరిపిన ప్రభుత్వం టెక్నికల్​ కమిటీ  నియమించింది. భద్రాచలంలో ఇప్పటికే  7.7 కి.మీల మేర కరకట్టలు ఉన్నాయి.  వీటిని ఎత్తు పెంచడం, బలోపేతం చేయడం, ఊళ్లో డ్రైన్, వర్షపు నీరు ఎత్తిపోయడానికి మోడ్రన్​ టెక్నాలజీని వాడుకోవడం ఇందులో భాగం.  కాగా కొత్తగా కట్టే కరకట్టల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఇరిగేషన్​ ఇంజినీర్లు తయారుచేశారు.  కేవలం నివాస ప్రాంతాల చుట్టూ కరకట్టలు కట్టడం, పెద్ద వాగులకు ఇరువైపులా గోడలు కట్టి, చిన్నవాగుల నీటిని గోదావరిలోకి వదిలేయడం ఇలా యాక్షన్​ ప్లాన్​ చేస్తున్నారు.  

భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, దుమ్ముగూడెం మండలాల్లో 36 వాగులు ఉన్నాయి. ఇందులో ఏడు పెద్ద వాగులు ఉన్నాయి. 800నుంచి 1,000 క్యూసెక్కుల ప్రవాహం ఉండే ఈ వాగుల నుంచి బ్యాక్​వాటర్​ గ్రామాల్లోకి  రాకుండా తీరం వెంబడి గోడలు కట్టాలని ప్లాన్​ చేస్తున్నారు. కరకట్ట కిలోమీటర్​ నిర్మించాలంటే రూ.30కోట్లు ఖర్చు అవుతుందనే అంచనా ఉంది. ముంపు సమస్యను ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య తక్కువగా ఉంటే అక్కడ కరకట్టకు బదులుగా వారిని ఎత్తైన ప్రాంతాలకు తరలించడం సులభం అనే  కోణంలోనూ టెక్నికల్​ కమిటీ స్టడీ చేయనుంది.  అలాంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి.? అనే వివరాలు కూడా సేకరించనున్నారు. పది రోజుల కింద 110 కిలోమీటర్ల కరకట్టల డిజైన్లు ఇరిగేషన్​ ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే మూడు రోజుల కింద హైదరాబాద్​లో ఇరిగేషన్​ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్​కుమార్​ అధ్యక్షతన జరిగిన భేటీలో చర్చించి అవసరమైన చోటే కరకట్టలు అనే కోణంలో తిరిగి రూపకల్పనకు టెక్నికల్​ కమిటీ ఏర్పాటు చేశారు.  వీటి నిర్మాణాన్ని తెలంగాణ సర్కారే చేపట్టనుంది.

ప్రపోజల్స్ ఇచ్చాం

గోదావరి తీరంలో కరకట్టల నిర్మాణానికి,  భద్రాచలంలో పాత కరకట్టల బలోపేతానికి రూ.3,500కోట్లతో ప్రపోజల్స్​ ప్రభుత్వానికి ఇచ్చాం. దీనిపై చర్చ జరిగింది. మార్పులు, చేర్పులు సూచిస్తూ అధ్యయనానికి టెక్నికల్​ కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్నీ పరిశీలించి పూర్తిస్థాయి రిపోర్టు ఇస్తుంది.  వరద నివారణ చర్యలకు కరకట్టలు తప్పనిసరి..

 రాంప్రసాద్​,ఈఈ, భద్రాచలం