- 70 శాతం రోడ్డు ప్రమాదాలు ఇక్కడే.. రాష్ట్రంలో మొత్తం
 - 930 స్పాట్స్ గుర్తింపు
 - రిపేర్లకు 300 కోట్లు కేటాయించినా పనుల్లో జాప్యం
 - రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రభుత్వం ఫోకస్!
 
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ రోడ్లపై ఉన్న బ్లాక్ స్పాట్స్(ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం) ప్రాణాంతకంగా మారాయి. బ్లాక్ స్పాట్స్ దగ్గరే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన ఆర్టీసీ రోడ్డు ప్రమాదం 19 మందిని బలిగొన్నది.
మూలమలుపు దగ్గరున్న గుంతను తప్పించబోయిన టిప్పర్ కంట్రోల్ తప్పడంతో ప్రమాదం జరిగినట్లు నిపుణులు చెప్తున్నారు. దీంతో మరోసారి బ్లాక్ స్పాట్స్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7,333 రోడ్డు ప్రమాదాలు జరగగా, అందులో 2,702 మృతి చెందారు. ఇందులో 70 శాతం వరకు బ్లాక్ స్పాట్ల వద్దే ప్రమాదాలు నమోదైనట్లు పోలీస్ రికార్డులను బట్టి తెలుస్తోంది.
రాష్ట్రంలో 930 బ్లాక్ స్పాట్స్
ఇంజినీరింగ్ పరిభాషలో బ్లాక్ స్పాట్ అంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం. రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే మూలమలుపులు, జంక్షన్లు, తరుచూ పాడయ్యే ఏరియాలను, రోడ్డు లోపాలు (పిత్హోల్స్) బ్లాక్ స్పాట్స్గా పిలుస్తారు. బ్లాక్ స్పాట్ ఏరియా 500 మీటర్ల పరిధిలో ఉంటుంది. రాష్ట్రంలో ఇలాంటి బ్లాక్ స్పాట్ ఏరియాలు 930 వరకు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా నేషనల్ హైవేలపై 640 ఉండగా.. స్టేట్ హైవేస్, ఇతర రోడ్లపై 290 ఉన్నట్లుగా పోలీస్, ఆర్ అండ్ బీ శాఖ ఇంజినీరింగ్వర్గాలు అధికారికంగా గుర్తించాయి. హైదరాబాద్, దాని చుట్టుపక్కల 54 యూ -టర్న్ ల దగ్గర బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు.
ముఖ్యంగా ఎన్హెచ్ -65 హైదరాబాద్ --– --సూర్యాపేట రహదారిపై అత్యధికంగా రోడ్డు యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పాటు రాచకొండ, సైబరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీస్ నివేదికలు తెలియజేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి భూపాలపట్నం ఎన్హెచ్ 163, హైదరాబాద్ బీజాపూర్ ఎన్హెచ్, నిజామాబాద్, జగదల్పూర్ ఎన్హెచ్-63, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు తదితర రోడ్లపై పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
రూ.300 కోట్లతో పనులు..
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్ లను సరిచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నాయి. రాష్ట్ర సర్కారు వివిధ బ్లాక్స్పాట్లను సరిచేసేందుకు రెండేండ్ల కింద రూ.300 కోట్లను కేటాయించింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్ను గుర్తించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
గుర్తించిన బ్లాక్ స్పాట్ ఏరియాలో రోడ్ల రిపేర్లు, లైటింగ్, షార్ప్ కర్వ్ లు సరిచేయడం లాంటి పనులు చేపట్టేందుకు డీపీఆర్లు కూడా రెడీ అయ్యాయి. కొన్నిచోట్ల పనులు మొదలైనప్పటికీ, చాలా చోట్ల ఊసేలేదు. తమిళనాడు మాదిరిగానే రాష్ట్రంలో డీపీఆర్ ప్రకారం.. రూ.900 కోట్లతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీటీవీలు, స్పీడ్ కంట్రోల్ పద్ధతులు, రహదారి విస్తరణ లాంటి పరిష్కారాలను చేపట్టడానికి సిద్ధమైనట్లు ఆర్ అండ్ బీ శాఖ ఇంజినీర్లు చెప్తున్నారు. అయితే, ఇది ఎప్పటికీ పూర్తవుతుందో అంతుచిక్కని పరిస్థితి.
