గజ్వేల్/వర్గల్, వెలుగు: వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఉత్పత్తి పెంచేలా పరిశోధనలు, చదువులు సాగాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలోని కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ, సీడ్ కంపెనీలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఎంటమాలజీ , పాథాలజీ, సాయిల్ సైన్స్, బ్రీడింగ్, ఫిజియోలజీ ల్యాబ్స్తో పాటు డ్రోన్, రోబో టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్, ఏఆర్అండ్వీఆర్ మోడల్స్, అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ వంటి అంశాలపై ఏర్పాటుచేసిన ఎగ్జిబిట్స్ను పరిశీలించారు.
ఈ క్రమంలో బీఎస్సీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ కౌశిక్ తయారు చేసిన ఆక్సిజన్తో నడిచే కారు ఇంజిన్ నమూనాను పరిశీలించి, స్టూడెంట్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆక్సిజన్తో నడిచే ఇంజిన్ను తయారు చేయడం పట్ల స్టూడెంట్ను గవర్నర్ అభినందించారు. అనంతరం సీడ్ కంపెనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు.
రీసెర్చ్ సెంటర్లో టిష్యూ కల్చర్, జినోమిక్స్, స్పీడ్ బ్రీడింగ్, ప్లాంట్ హెల్త్ ల్యాబ్స్, జీన్ బ్యాంక్లను సందర్శించి చాలా అధునాతనంగా ఉన్నాయని అభినందించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... వ్యవసాయ ఉత్పాదతకతను పెంచేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో పాటు పరిశోధనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్స్లర్ ప్రభాకర్రావు, వైస్ చాన్స్లర్ ప్రవీణ్రావు, కలెక్టర్ హైమావతి, సీపీ విజయ్కుమార్, గజ్వేల్ ఆర్డీవో వి.చంద్రకళ, వర్గల్ తహసీల్దార్ రఘువీర్రెడ్డి, ఏసీపీ నర్సింహులు, సీఐ మహేందర్రెడ్డి, కావేరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ బి. శ్రీనివాసులు, స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్ష పొలసాని, అగ్రికల్చరల్ డీన్ ప్రతాప్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
