
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలంటూ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్. జులై 14న గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన తీన్మార్ మల్లన్న.. తనపై కవిత గూండాలు తనపై దాడితో పాటు హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. కవితపై చర్యలతో పాటు ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కవిత బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తుందన్న తీన్మార్ మల్లన్న.. ఎమ్మెల్సీ కవితపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. కవిత ఆమె గూండాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. కంచం పొత్తు మంచం పొత్తు అనేది తెలంగాణ సాంప్రదాయంలో భాగం. బియ్యం పుచ్చుకోవడాన్ని ఆ రకంగా అంటాం. కవిత దొరల ఫ్యామిలీ కాబట్టి వాళ్లకు అంత తెలియదు. ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఎమ్మెల్సీ కవిత తన ఎమ్మెల్సీ పదవిని పబ్లిక్ కోసం ఉపయోగించాలి. ఈ రకంగా కక్ష చర్యలు చేపట్టరాదు. బీసీలను అణగదొక్కాలని కవిత చూస్తుందని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు.
జులై 13న తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై తెలంగాణ జాగృతి నేతలు కొందరు దాడి చేశారు. ఆఫీసులో ఫర్నీచర్స్,కుర్చీలు ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నంలో తీన్మార్ మల్లన్న గన్ మెన్ గాల్లో కాల్పులు జరిపారు. ఈ ఘటనపై కవిత, తీన్మార్ మల్లన్నలపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో్ ఇప్పటికే కేసు నమోదు చేశారు పోలీసులు.