- పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
సూర్యాపేట, వెలుగు: బీసీల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడిందని, రాబోయే కాలంలో బీసీల ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి తీన్మార్ మల్లన్న, టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాధికార పార్టీ పుట్టుకే ఒక చరిత్ర అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ వల్ల కాదని, అగ్రవర్ణ నేతలు ఇవ్వడానికి సిద్ధంగా లేరని ఆరోపించారు. తెలంగాణలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నా మనకు రావాల్సిన హక్కులు దక్కలేదన్నారు.
2028లో తెలంగాణ రాజ్యాధికార పార్టీదే రాజ్యాధికారమని స్పష్టం చేశారు. 78 ఏళ్లుగా ఇతరుల జెండాలు పట్టామని మొదటిసారి బీసీ బిడ్డ రుద్ర రాజేశం డిజైన్ చేసిన టీఆర్పీ జెండా పట్టబోతున్నామన్నారు. ప్రభుత్వ పాలన గాడి తప్పిందని స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని, విద్య, వైద్యం అందుబాటులో లేవని విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నదన్నారు. సూర్యాపేట నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
